హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): కృష్ణాబోర్డుకు ప్రాజెక్టులు అప్పగించడమంటే తెలంగాణ జలహక్కులకు తీవ్ర విఘాతం కలిగించడమేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఆందోళన వ్యక్తంచేశారు. ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం తీవ్ర గందరగోళంలో ఉన్నదని గురువారం ఓ ప్రకటనలో దుయ్యబట్టారు. ప్రాజెక్టుల స్వాధీనం అంశానికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం పలుమార్లు ప్రస్తావించిన అంశాలనే పేర్కొంటూ గత నెల 27న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని గుర్తుచేశారు. ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణాబోర్డుకు అప్పగిస్తున్నట్టు ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు మీడియా ముందు ప్రకటించారని, ఈ నేపథ్యంలో కేంద్రానికి ప్రభుత్వం రాసిన లేఖ ప్రామాణికమా? లేదంటే సమావేశంలో అంగీకారం ప్రామాణికమా? చెప్పాలని డిమాండ్ చేశారు.
కృష్ణాబోర్డుకు ప్రాజెక్టులు అప్పగించబోతున్నారని తాను చెబితే హరీశ్రావు వద్ద పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారని, మరి నేడు ఏం జరిగిందని ప్రశ్నించారు. ఇకపై చుక్క నీరు తీసుకోవాలన్నా కృష్ణాబోర్డు అనుమతి తప్పనిసరని పేర్కొన్నారు. బోర్డు అనుమతి లేకుండా విద్యుదుత్పత్తి సాధ్యమా? అని నిలదీశారు. ఇంజినీర్లు, అధికారులు ప్రాజెక్టుల వద్దకు వెళ్లాలన్నా బోర్డు అనుమతి ఉండాల్సిందేనని తెలిపారు. మార్పు అంటే తెలంగాణ ప్రయోజనాలు, హకులు కేంద్రం, ఏపీ చేతిలో పెట్టడమా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
2021లో కేంద్రం గెజిట్ ఇచ్చి ఒత్తిడి తీసుకొచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు ఇచ్చేందుకు అంగీకరించలేదని హరీశ్రావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కూడా కాకముందే ప్రాజెక్టులు ఇచ్చేందుకు అం గీకరించిందని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది ఎవరో ఈ ఒక్క విషయంతోనే స్పష్టం అవుతున్నదని, తెలంగాణ ప్రజలు అన్ని విషయాలు అర్థం చేసుకోవాలని కోరారు. తాను రాజకీయాలు మాట్లాడడం లేదని, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలని, మేధావులు మౌనం వీడాలని కోరారు. ప్రాజెక్టుల అప్పగింతకు గత ప్రభుత్వమే అంగీకరించిందన్న కాంగ్రెస్ విమర్శలను తీవ్రంగా ఖండించారు. అదే నిజమైతే కేఆర్ఎంబీ ఇప్పటి వరకు ప్రాజెక్టులను ఎందుకు స్వాధీనం చేసుకోలేదని హరీశ్రావు ప్రశ్నించారు.