Harish Rao | హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్నదాతలను ఆగం చేసే విధంగా కాంగ్రెస్ బడ్జెట్ ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం హరీశ్రావు మీడియాతో మాట్లాడారు.
రైతులకు చాంతాడంత చేస్తామని చెప్పి చెంచాడంత కూడా నిధులు కేటాయించలేదని హరీశ్రావు ధ్వజమెత్తారు. రైతులను ఆగం చేసేలా ఈ బడ్జెట్ ఉంది. రాష్ట్ర బడ్జెట్ తెలంగాణ ప్రజలను తీవ్ర నిరాశపరిచింది. రాష్ట్రంలో ప్రజా పాలన అభాసుపాలైంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రతి రోజూ సీఎం ప్రజా దర్బార్ నిర్వహిస్తామన్నారు. వాగ్దాన భంగంతో కాంగ్రెస్ పాలన ప్రారంభమైంది. గ్యారెంటీల అమలు విషయంలో ప్రజలకు స్పష్టత ఇవ్వలేకపోయారు. అన్నదాతలను ఆగంజేసే విధంగా కాంగ్రెస్ బడ్జెట్ ఉంది. రైతులకు బడ్జెట్లో నామమాత్రపు కేటాయింపులు ఉన్నాయి. వ్యవసాయ రంగానికి రూ. 19,746 కోట్లు పెట్టారు. వీటిలో జీతాలకే రూ. 3 వేల కోట్లు పోతాయి. మిగిలిన రూ. 16 వేల కోట్లతో రైతులకు ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తారు..? కోటి 50 లక్షల ఎకరాల భూమికి రైతు భరోసాకే రూ. 22,500 కోట్లు కావాలి. డిసెంబర్ 9న రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని మాట తప్పారు. రూ. 2 లక్షల రుణమాఫీకి రూ. 40 వేల కోట్లు అవసరం.. కానీ బడ్జెట్లో పైసా కేటాయించలేదు. అన్ని రకాల పంటలకు బోనస్ ఇస్తామన్నారు. దీనికి రూ. 15 వేల కోట్లు అవసరం. ఇవన్నీ అమలు చేయాలంటే రూ. 82 వేల కోట్లు కావాలి. బడ్జెట్లో కేటాయించింది కేవలం రూ. 16 వేల కోట్లు మాత్రమే. కాంగ్రెస్ పార్టీ రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు అని హరీశ్రావు పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారంలో అబద్దాలు చెప్పారు.. నిండు అసెంబ్లీలోనూ అబద్దాలు చెప్పారని హరీశ్రావు మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులకు 24 గంటల కరెంట్ వస్తుందా..? ఎక్కడ కూడా 15 గంటలకు మించి కరెంట్ రావడం లేదు. ఏ సబ్ స్టేషన్కైనా వెళ్దామని కాంగ్రెస్ నేతలకు చాలెంజ్ విసురుతున్నా. గత కాంగ్రెస్ పాలనలో ఉచిత కరెంట్ అంత ఉత్త కరెంట్. బీఆర్ఎస్ పాలనలో ఉచిత కరెంట్తో రైతులు ఆనందంగా ఉన్నారు. చెరువులు బాగు చేసి, ఉచిత కరెంట్ ఇచ్చి రైతును రాజును చేసింది కేసీఆర్. రైతును మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. శ్వేతపత్రాల పేరుతో కాంగ్రెస్ కాలం గడుపుతోంది. 6 గ్యారెంటీలకు చట్టం చేస్తామన్న మాటలు ఏమయ్యాయి. కొండంత ఆశ చూపి గోరంత కూడా చేయలేదు. రుణమాఫీకి బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించలేదు. నిరుద్యోగ భృతి గురించి బడ్జెట్లో ప్రస్తావన లేదు అని హరీశ్రావు నిలదీశారు.