Harish Rao | సంగారెడ్డి/హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): ‘అతి తెలివి బం జెయ్.. రేవంత్. అర్థంకాక, ఆలోచన లేక, ఆగమాగమై ప్రాజెక్టులు అప్పజెప్పి రేపటి రోజు హైదరాబాద్కు తాగునీరు లేకుండా చేసినవ్. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్కు సాగునీరు, తాగునీటికి సమస్య వస్తుంది. పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడే హక్కు నీకు ఉన్నదా? నాడు అసెంబ్లీలో మేం కొట్లాడినం. మంత్రి పదవులను మీ కాంగ్రెస్ ప్రభుత్వంపై విసిరికొట్టినం. నువ్వు ఆ నాడు టీడీపీలో ఉండి పెదవులు మూసుకున్నవ్. నువ్వా మా గురించి మాట్లాడేది?’ అని సీఎం రేవంత్పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ పెడదామన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ప్రతిసవాల్ విసిరారు. ‘యస్! మేం రెడీ. అసెంబ్లీలో చర్చ పెట్టు. నీ దిమ్మదిరిగేటట్టు సమాధానం చెప్తం. గతంలో అసెంబ్లీలో కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ పెడితే పారిపోయింది మీ కాంగ్రెస్ పార్టీ. కానీ మేం అలా కాదు. పారిపోం. మేం సిద్ధంగా ఉన్నాం. నువ్వు చేసిన మోసాన్ని అసెంబ్లీ సాక్షిగా బయటపెడ్తం.
తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేలా వివరంగా చెప్తం’ అని స్పష్టం చేశారు. ఆదివారం ఎమ్మెల్యేలు మహిపాల్రెడ్డి, సుధీర్రెడ్డి అధ్యక్షతన పటాన్చెరు, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో నిర్వహించిన సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వంలో కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా ఏ రోజూ కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులు అప్పజెప్పలేదని స్పష్టం చేశారు. ‘నీళ్లపై తెలంగాణకు 50 శాతం వాటా ఇవ్వాలి, శ్రీశైలం ప్రాజెక్టును హైడల్ ప్రాజెక్టుగా గుర్తించాలి అని అనేక షరతులు పెట్టాం. కేంద్రం ఒప్పుకోలేదు. అందుకే మేం ప్రాజెక్టులు అప్పజెప్పలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కూడా కాకముందే మన ప్రాజెక్టులన్నీ కేంద్రానికి అప్పజెప్పింది. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టింది’ అని తెలిపారు. సీఎం రేవంత్కు విషయం లేక విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
రేవంత్వి చిల్లర మాటలు రాజకీయాల్లో హుందాతనం
ఉండాలని ఆదివారం ఉదయం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రేవంత్కు చెప్పారని, కానీ మధ్యాహ్నానికే రేవంత్ చిల్లర మాటలు, అసభ్యపు మాటలు మాట్లాడారని హరీశ్రావు వెల్లడించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతున్నారో, ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నారని, రేవంత్ మాటలు టీవీలో చూసి పిల్లలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పాలని బిల్లు పెట్టి పాస్ చేసింది కాంగ్రెస్ కాదా? అని హరీశ్రావు ప్రశ్నించారు. బిల్లును తయారు చేసింది మీ జైపాల్రెడ్డి కాదా? అని నిలదీశారు.
తెలంగాణ కోసం పోరాడేది బీఆర్ఎస్సే
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్కు కేవలం స్పీడ్బ్రేకర్ లాంటివని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఢిల్లీలో తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడాలంటే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించాలని చెప్పారు. ఎంపీ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటాలని, పట్టుదలతో పనిచేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్కు జాతీయస్థాయిలో, ఇటు రాష్ట్రంలో ఎలాంటి భవిష్యత్తు లేదని తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచే పరిస్థితి లేదని వెల్లడించారు. కాంగ్రెస్కు ఓటమి తప్పదని తెలిసే, సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై వెనక్కి తగ్గుతున్నారని విమర్శించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడవద్దని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుకోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మెల్యే సునీతారెడ్డి, మాజీఎమ్మెల్యేలు మదన్రెడ్డి, కే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వంటేరు ప్రతాప్రెడ్డి, గాలి అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
హామీలపై బాండ్ పేపర్ రాసిచ్చింది కాంగ్రెస్ కాదా?డిసెంబర్లో 4 వేల పెన్షన్ ఇస్తామన్నది కాంగ్రెస్ కాదా?డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ ఇస్తామన్నది కాంగ్రెస్ కాదా? ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ ఇస్తామన్నది కాంగ్రెస్ కాదా?
– హరీశ్రావు
24 గంటల కరెంటును 12 గంటలకే కోత పెట్టడమే మార్పా?ఫిబ్రవరి వచ్చినా రైతులకు రైతుబంధు ఇవ్వకపోవటమే మార్పా?ప్రాజెక్టులపై రాష్ర్టానికి అధికారం లేకుండా చేయటమే మార్పా?6 లక్షల మంది ఆటోడ్రైవర్లను రోడ్డుమీదికి తేవటమే మార్పా?
– హరీశ్రావు
రాముడితో బీజేపీ రాజకీయాలు
కేంద్రంలోని బీజేపీ రాముడితో మత రాజకీయాలు చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. రాముడు ప్రతి ఒక్కరికి దేవుడని, ప్రజలంతా ఆయనను కొలుస్తారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రాజకీయ లబ్ధిపొందేందుకు బీజేపీ రాముడిని రాజకీయాలతో ముడిపెడుతుందని విమర్శించారు. కేసీఆర్ సైతం తెలంగాణలో యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించారని, ఎన్నడూ మత రాజకీయాలకు పాల్పడలేదని గుర్తు చేశారు.
ఆటోడ్రైవర్ల సమ్యలపై గళమెత్తుతాం
రాష్ట్రంలో ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడటం బాధించిందని హరీశ్రావు అన్నారు. ఆటోడ్రైవర్ల సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తి వారి తరపున పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ఆటోడ్రైవర్లను ఆయన కలిశారు. ఆటో అడ్డా వద్ద ఉన్న డ్రైవర్లను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఆటోడ్రైవర్లు అశోక్, పాషా, ఖాదర్ తదితరులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను మాజీ మంత్రి హరీశ్రావు దృష్టికి తెచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో మహిళలు ఎవ్వరూ ఆటోలో ప్రయాణించడం లేదని, గిరాకీలు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పారు. ఆటోడ్రైవర్లు ఎవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ధైర్యంగా ఉండాలని హరీశ్రావు కోరారు. రాష్ట్రంలోని 6.50 లక్షల మంది ఆటోడ్రైవర్ల పక్షాన అసెంబ్లీలో బీఆర్ఎస్ బలంగా గళం విప్పుతుందని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని తెలిపారు.
ఆటోడ్రైవర్లకు అండగా ఉంటాం హరీశ్రావు: నీ పేరు?
ఆటోడ్రైవర్: హైదర్ అలీ
హరీశ్రావు: ఎట్లుంది మీ దందా?
ఆటోడ్రైవర్ : దందా ఆగం ఉన్నది సార్. గిరాకీలు లేక ఆటోఫైనాన్స్ కట్టలేకపోతున్న. ఒక ఫైనాన్స్ కట్టకపోతే దానికి ఫైన్ వేస్తున్నరు. మీ సర్కారు ఉండగా మంచిగుండె. కేసీఆర్ సార్ ట్యాక్స్లు తీసేసిండు. ఫ్రీ బస్సుతో రాష్ట్రంలో ఉన్న 6.50 లక్షల మంది ఆటోడ్రైవర్లు రోడ్డున పడ్డరు. ఇప్పటికే 12 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నరు. మీరే మా కోసం ఆలోచించాలే సార్.
హరీశ్రావు: అందరికీ అండగా ఉంటాం. ఎవ్వరూ ధైర్యం కోల్పోవద్దు. ఆత్మహత్యలు చేసుకోవద్దు. జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మీ కోసం కొట్లాడుతాం.
మరో ఆటో డ్రైవర్తో..
ఆటోడ్రైవర్: కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు సంపాదిస్తుంటి. ఇప్పుడు రోజుకు మూడు, నాలుగు వందలు కూడా వస్తలేవు. ఆటో కిస్తులు కట్టుడు కష్టం అయితున్నది. గిరాకీ అయితలేదు. పైసల్లేక ఇంటి కిరాయిలు కట్టలేకపోతున్నం. పిల్లల స్కూలు ఫీజులు, కాలేజీ ఫీజులు కట్టకపోతే ఇంటికి పంపిస్తున్నరు. కాంగ్రెస్ సర్కారు అచ్చినంక మా బతుకులు ఆగమైనయి. బతుకుదెరువు లేకుండా పోయింది.