Padi Kaushik Reddy | హుజూరాబాద్ చౌరస్తాలో పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్రావు పరామర్శించారు. కౌశిక్ రెడ్డికి ఫోన్ చేసి ఘటన జరిగిన తీరు, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆందోళన చెందవద్దని.. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఘటనపై న్యాయపరంగా ముందుకెళ్దామని సూచించారు.
కాగా, అంబేద్కర్ విగ్రహం సాక్షిగా, హుజురాబాద్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై జరిగిన పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. దళిత బంధు లబ్ధిదారులకు రెండో విడత ఆర్థిక సహాయం చెల్లించాలని కోరడమే కౌశిక్ రెడ్డి చేసినా తప్పా? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా? ఇది ప్రజా పాలన కాదు.. రేవంత్ మార్కు రాక్షస పాలన.. కాంగ్రెస్ మార్కు నిరంకుశ పాలన.. ఇందిరమ్మ ఎమర్జెన్సీ నాటి నిర్బంధ పాలన అని హరీశ్రావు ధ్వజమెత్తారు. అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మా ఎమ్మెల్యే ఆరోగ్యం, భద్రత పట్ల పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. అరెస్ట్ చేసిన బిఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని హరీశ్రావు పేర్కొన్నారు.