Osmania University | హైదరాబాద్/సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ)/ఉస్మానియా యూనివర్సిటీ: వందేండ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నడూ లేని దయనీయ పరిస్థితి నెలకొన్నది. ‘విద్యార్థులకు నీళ్లు ఇవ్వలేం.. విద్యుత్తు సరఫరా చేయలేం.. వెంటనే హాస్టళ్లు ఖాళీ చేసి వెళ్లిపోండి..’ అంటూ విద్యార్థులకు చీఫ్ వార్డెన్ నోటీసు జారీచేశారు. నెల రోజులపాటు హాస్టళ్లు, మెస్లు మూసివేసే ఉంటాయని నోటీసులో పేర్కొన్నారు.
ఈ నోటీసు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి రావడంతో ట్విట్టర్లో (ఎక్స్)లో పోస్టుచేసి కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రాష్ట్రంలో కరెంటు, తాగు, సాగునీటి కొరతలకు ఈ నోటీసు ఇదే నిదర్శనమని, సీఎం, డిప్యూటీ సీఎం నాలుగు నెలలుగా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ జారీ చేసిన నోటీసు సీఎం, డిప్యూటీ సీఎం చెప్తున్నవి అవాస్తవమని స్పష్టం చేస్తున్నది. తెలంగాణలో కరెంటు, తాగు, సాగునీటి కొరత ఉన్నదనేది వాస్తవం’ అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఈ పోస్టు వైరల్గా మారింది. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. వెంటనే విచారణకు ఆదేశిస్తున్నట్టు తెలిపారు. చీఫ్ వార్డెన్కు ఓయూ రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ షోకాజ్ నోటీసు జారీచేశారు.
హాస్టల్ ఖాళీ చేయాల్సిన అవసరం లేదు: భట్టి
యూనివర్సిటీ విద్యార్థులు హాస్టళ్లు ఖాళీ చేయాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టంచేశారు. ఓయూ విద్యుత్తు, తాగునీటి కొరత ప్రకటనలతోపాటు సోషల్ మీడియాలో వైరల్పై విచారణకు ఆదేశించినట్టు పేర్కొన్నారు. విద్యుత్తు సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని ప్రాథమిక నివేదికలో తేలిందని వివరించారు.
కరెంట్ సరఫరా చేస్తున్నాం: విద్యుత్తు శాఖ
యూనివర్సిటీలో ఎలాంటి కరెంటు కోతల్లేవని విద్యుత్ శాఖ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జలమండలి అధికారులు కూడా ఒప్పందం కంటే ఎక్కువ పరిమాణంలోనే మంచినీటిని సరఫరా చేస్తున్నామని ప్రకటించారు.
వేసవి సెలవులు ఇవ్వడం సాధారణమే: చీఫ్ వార్డెన్
చీఫ్ వార్డెన్ డాక్టర్ కొర్రెముల శ్రీనివాస్ను నమస్తే తెలంగాణ సంప్రదించగా… అన్ని యూనివర్సిటీల్లో సెమిస్టర్ పరీక్షల అనంతరం వేసవి సెలవులు ఇవ్వడం సాధారణమేనని తెలిపారు. ఓయూలోనూ ఎన్నో ఏళ్లుగా ఇదే రీతిన నోటీసు ఇస్తామని చెప్పారు. నోటీసులో కొన్ని క్లరికల్ తప్పిదాలు దొర్లాయని చీఫ్ వార్డెన్ చెప్పడం గమనార్హం.
మంచినీటి సరఫరా కోసం రాస్తారోకో
వాస్తవానికి ప్రతి ఏటా సెలవులు ప్రకటిస్తూ చీఫ్ వార్డెన్ నోటీసు జారీ చేయడం సాధారణమే. కాకపోతే తీవ్ర నీటి, కరెంటు కొరత ఉందని చీఫ్ వార్డెన్ అందులో ప్రస్తావించడం వివాదాస్పదంగా మారింది. రెండు రోజుల కిందట లేడీస్ హాస్టల్ విద్యార్థినులు తమకు వారం రోజులుగా మంచినీటి సరఫరా లేదని, అందరికీ ఒక్క ట్యాంకర్ ఇస్తే దానికి పూజ చేయాలా? అంటూ రాస్తారోకో నిర్వహించారు.
ఈ నేపథ్యంలో చీఫ్ వార్డెన్ నోటీసు జారీ చేయడంతో విద్యార్థులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. వర్సిటీ చరిత్రలో ఏనాడూ నీరు, విద్యుత్తు ఎద్దడి నేపథ్యంలో సెలవులు ప్రకటించలేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేశారు. మరోవైపు మానేరు హాస్టల్లో తాగునీటి శుద్ధి ప్లాంటు (ఆర్వో ప్లాంటు) రెండు రోజుల క్రితం పాడైపోవడంతో విద్యార్థులు చీఫ్ వార్డెన్ కార్యాలయంలో సోమవారం ఆందోళన నిర్వహించారు. ఆర్వో ప్లాంటును వెంటనే పునరుద్ధరిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు..
ఓయూలో నీళ్లు లేవనే కారణంతో సెలవులు ప్రకటించడం హేయమైన చర్య అని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు మండిపడ్డారు. నాలుగు నెలలుగా విశ్వవిద్యాలయంలో నీళ్లు, కరెంట్, సరైన వసతులు లేక, ఆహారంలో పురుగుల భోజనం వంటి సమస్యలతో విద్యార్థులు బాధపడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. తక్షణమే నీరు, విద్యుత్తు సరఫరాను చేపట్టి సెలవులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
కరెంట్ కోతలు వాస్తవమే.. ఓయూ ఘటనే సాక్ష్యం
రాష్ట్రంలో కరెంట్ కోతలు నిత్యకృత్యం మారాయని మరోసారి రుజువైంది. నీటి ఎద్దడి, కరెంట్ కోతల కారణంగా హాస్టళ్లు ఖాళీ చేయాలని చీఫ్ వార్డెన్ నోటీసు ఇవ్వడం ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. కరెంటు కోతలు లేవని ఇన్ని రోజులు డిప్యూటీ సీఎం, విద్యుత్తుశాఖ మంత్రి భట్టి విక్రమార్క చెప్తున్న మాటల్లో నిజం లేదని మరోసారి స్పష్టమైంది.