Fingerprint bureau | హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): నేరాన్ని నిరూపించటానికి ఆధారం కావాలి. ఒక్క క్లూ దొరికినా చాలు.. తీగను పట్టుకొని కొండలను లాగొచ్చు. అలాంటి ఆధారాలను సేకరించి భద్రపరడంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నది తెలంగాణ పోలీస్ శాఖలోని ఫింగర్ప్రింట్స్ బ్యూరో. సాంకేతికతను అందిపుచ్చుకొని ఎప్పటికప్పుడు నేరస్థుల డాటాను అప్డేట్ చేస్తూ అత్యంత పకడ్బందీ డాటాబేస్ను నిర్వహిస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 9,92,156 మంది నేరస్థుల డాటాబేస్ను కలిగి ఉన్నది ఫింగర్ప్రింట్స్ బ్యూరో. దీంతో రాష్ట్రంలో ఏ మూలన ఏ నేరం జరిగినా.. పోలీసులకు ఫిర్యాదు అందిన వారంలోపే నేరస్థులను పట్టుకోగలుగుతున్నారు. అదీ మన పోలీసుల సామర్థ్యం.
4,684 మంది అనుమాతుల గుర్తింపు
ఇండ్లలో జరిగే దొంగతనాల దగ్గర్నుంచి హత్యలు, దోపిడీలు, ఆత్మహత్యలు, లైంగికదాడులు, అనుమానాస్పద మృతులు వంటి పలు రకాల నేరాలకు పాల్పడిన నేరస్థులను పట్టుకోవడంతో ఫింగర్ప్రింట్స్ బ్యూరో దగ్గర ఉన్న డాటాబేస్ కీలకంగా మారుతున్నది. పాస్పోర్ట్ వెరిఫికేషన్కు సైతం ఈ డాటా బేస్ ఉపయోగపడుతున్నది. 2022లో వేలిముద్రల ద్వారా సుమారు 420 కేసులను, 42 గుర్తుతెలియని మృతదేహాలను గుర్తించారు. 2022లో వేలిముద్రలు, వివిధ సాంకేతిక పరికరాలు ఉపయోగించి వివిధ కేసుల్లో 4,684 మంది అనుమానితులను గుర్తించారు. నేరస్థులను గుర్తించేందుకు స్కెచ్ ఆర్టిస్ట్ల అవసరం లేకుండా ఫేస్ డిటెక్షన్ సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తున్నారు. అనుమానిత నేరస్థుల చిత్రాలు కొన్ని లక్షలు ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.
వందశాతం ఫలితాల కోసం ఏఎఫ్ఐఎస్
నేరస్థులను పట్టుకోవడంలో రాష్ట్ర పోలీసులు అడ్వాన్స్డ్గా ఉన్నారు. ‘ఆటోమేటెడ్ ఫింగర్ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (ఏఎఫ్ఐఎస్)’ సాయంతో నేరస్థులను వెంటనే పట్టుకొంటున్నారు. ఇది సెకనులో ఒక బిలియన్ వేలిముద్రల రికార్డులను పరిశీలించగలదు. ఈ సాంకేతికత వేలిముద్ర రికార్డుల కంప్యూటర్ డాటాబేస్తో అనుసంధానమై ఉంటుంది. నేరానికి సంబంధించిన వేలిముద్రలు దొరికితే ఈ సాంకేతికత ద్వారా క్షణాల్లో పసిగట్టొచ్చు. దీని ద్వారా నాన్ బెయిలబుల్ వారెంట్ కేసుల్లో తప్పించుకొని తిరుగుతున్న 58 మందిని పట్టుకున్నారు. ‘క్రిమినల్ అప్రిహెన్షన్ టూల్’ ద్వారా 130 మంది నేరస్థులను పట్టుకున్నారు. ఇక ఏఎఫ్ఐఎస్లను పాస్పోర్టు వెరిఫికేషన్కు ఉపయోగించి 34 మంది నేరస్థులను పట్టుకున్నారు.