సిరిసిల్ల రూరల్ : ప్రజలందరి భాగస్వామ్యంతో మత్తు పదార్థాలు, గంజాయి రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్లను తీర్చిదిద్దుతామని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. శనివారం ఆయన జిల్లా పోలీసులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్, డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశాల మేరకు దేశ భవిష్యత్ను నిర్ణయించే.. యువత మత్తు పదార్థాల బారినపడకుండా ఉండేందుకు సరఫరాదారులు, ఉత్పత్తిదారులపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, దీంతో పరిశ్రమలు వచ్చి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వస్తున్నాయన్నారు.
అభివృద్ధికి ఆటంకంగా మారుతున్న గంజాయి.. ఇతర మత్తు పదార్థాలను నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. యువత డ్రగ్స్ బారినపడకుండా కాపాడాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. జిల్లా పరిధిలో వందశాతం గంజాయిని నియంత్రించి.. గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే ముందున్న లక్ష్యమని ఎస్పీ అన్నారు. ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యలు కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో గంజాయి రహిత జిల్లాగా మార్చడం కోసం హోంగార్డు నుంచి ఎస్పీస్థాయి వరకు ప్రతి అధికారి కష్టపడాల్సి ఉంటుందన్నారు. పోలీస్స్టేషన్ల పరిధిలో గతంలో గంజాయి, గుట్కా రవాణాకు వ్యక్తుల సమాచారంతో పాటు గంజాయి సాగు చేసిన వ్యక్తుల సమాచారాన్ని సేకరించడంతో పాటు ప్రస్తుత స్థితిగతులపై ఆరా తీయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.
గంజాయి రవాణా చేసే వారాన్ని సమాచారాన్ని తెలుసుకునేందుకు పటిష్టమైన ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని, వారికి నజరానాలు సైతం అందిస్తూ వివరాలను గోప్యంగా ఉంచాలన్నారు. గంజాయి నియంత్రణలో ప్రతిభ చూపిన అధికారులు, సిబ్బందికి శాఖాపరమైన గుర్తింపు ఇవ్వాలన్నారు. గంజాయి కట్టడికి నైపుణ్యం ఉన్న అధికారులతో యాక్షన్ ప్లాన్ రూపొందించాలని, అలాగే పోలీస్స్టేషన్ల పరిధిలో కాలేజీలపై దృష్టి సారించాలన్నారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఠాణా పరిధిలో ఎలాంటి గంజాయిలు కేసులు నమోదు కాలేదని అలసత్వం ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని, నేరం జరిగాక బాధపడే కన్నా ముందస్తుగా చర్యలు తీసుకోవడం అవసరమన్నారు.
గంజాయి రవాణా, సాగుకు పాల్పడే వారి మూలాలను గుర్తించి వారి పట్టుకోవాలని, నిందితులపై అవకాశాన్ని పీడీయాక్ట్ నమోదు చేయడంతో పాటు నేరాలు కోర్టులో రుజువయ్యేలా తగిన సాక్ష్యాధాలను కోర్టులో ప్రవేశపెట్టాలన్నారు. స్టేషన్ అధికారులు ఎప్పటికప్పుడు తమ పరిధిలోని పాన్షాపులను తనిఖీ చేయాలన్నారు. గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు జిల్లా ప్రజలు సైతం సహకరించాలన్నారు. బయట జిల్లాల నుంచి పోలీసులు ఇక్కడకు వచ్చి అరెస్టు చేసే పరిస్థితి తీసుకురావొద్దని సూచించారు.
యువత, విద్యార్థిని విద్యార్థులు డ్రగ్స్కు అలవాటుపడకుండా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిపై నిఘా ఉంచాలన్నారు. ట్రాన్స్పోర్ట్ వ్యవస్థపై సైతం నిఘా ఉంచాలని, అప్పుడప్పుడు తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. గంజాయి నిర్మూలనకు ప్రత్యేకంగా టాస్క్ఫోర్స్ టీం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మద్దతు పదార్థాల గురించి ఏదైనా సమాచారం అందితే వెంటనే జిల్లా పోలీస్ వాట్సాప్ నంబర్ 6303 922 572 లేదా డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వివరాలు గోప్యంగా ఉంచుతామన్న ఆయన.. నగదు పురస్కారాలు అందజేయనున్నట్లు తెలిపారు.