సూర్యాపేట టౌన్, జనవరి 17 : యావత్తు దేశం దద్దరిల్లేలా బుధవారం ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నట్టు విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాష్ర్టాల సీఎంలు, మాజీ సీఎంలు, జాతీయ స్థాయి ప్రముఖులంతా ఒకే వేదికపై కలువనున్న నేపథ్యంలో అదే వేదికపై సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని వినేందుకు దేశ ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు లక్షలాదిగా తరలివచ్చి దేశ ప్రజలు గర్వించేలా బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ బలాన్ని చాటిచెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణ మాదిరి సంచలనాత్మక పథకాలు తమకెప్పుడొస్తాయా? అని దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. అది ఒక్క కేసీఆర్తోనే సాధ్యమని యావత్తు దేశం నమ్ముతున్నదని తెలిపారు. సమావేశంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొన్నారు.