జనగామ : గతంలో ఎన్నడూ లేని విధంగా మన ఊరు- మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, వైద్య శాలలను బాగు చేసే పనిని సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. ఈ మహా యజ్ఞంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
పాలకుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో సీజీఐ సౌజన్యంతో బాల వికాస ప్రతినిధులు శౌరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొవిడ్ కిట్లు, హ్యాండ్ వాష్ యూనిట్లను నియోజకవర్గంలోని ఐదు మండలాల ఉన్నత పాఠశాలలకు పంపిణీ చేసి మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా రూ.7,289 కోట్ల వ్యయంతో మన ఊరు- మనబడి కార్యక్రమం అమలు చేస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా ఈ సంవత్సరం 3,497 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలోని 9 వేల 123 ప్రభుత్వ పాఠశాలను బాగు చేస్తున్నామన్నారు. పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ సంవత్సరంలో మొత్తం 104 ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో మన ఊరు- మనబడి కార్యక్రమం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి విద్యాశాఖ అధికారులు ఎంపిక చేశారని వివరించారు. కాగా నైట్ వాచ్మెన్ భిక్షపతి తన వంతు విరాళంగా రూ.10 వేలు ప్రకటించారు. NRI మెతుకు ఉపేందర్ మరో 10 వేలు మన ఊరు-మన బడికి ప్రకటించారు. కాగా మంత్రి భిక్షపతి ని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివలింగయ్య, తదితరులు పాల్గొన్నారు.