హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): తప్పిపోయిన పిల్లలను, బాలకార్మికులను, అక్రమ రవాణా చేయబడిన పిల్లలను వివిధ పనిప్రదేశాల్లో గుర్తించి, రక్షించడానికి ప్రభుత్వం చేపడుతున్న ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం చురుకుగా సాగుతున్నది. ఈ నెల ప్రారంభం నుంచి 13వ తేదీ వరకు సుమారు 800 మంది చిన్నారులను బృందాలు రెస్క్యూ చేసినట్టు సమాచారం. ఏటా జనవరి 1 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘ఆపరేషన్ స్మైల్’ నిర్వహిస్తారు. ప్రస్తుతం 120 పోలీసు బృందాలు (ఎస్సై, లేడీతో కలిపి నలుగురు కానిస్టేబుళ్లు) మహిళాశిశు సంక్షేమశాఖ అధికారులు, శిశు సంక్షేమ కమిటీలు, జిల్లాల బాలల సంరక్షణ యూనిట్లు, ఎన్జీవోల ప్రతినిధులు, లేబర్ ఆఫీసు, ఆరోగ్యశాఖ అధికారులు ఈ ఆపరేషన్ స్మైల్ బృందాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.
వీరంతా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు, దేవాలయాలు, ట్రాఫిక్ జంక్షన్లు, మెకానిక్ దుకాణాలు, ఇటుక బట్టీలు, భవన నిర్మాణ ప్రాంతాలు, టీస్టాల్స్, ఫుట్పాత్ల్లో పిల్లలను గుర్తించి.. సాంకేతికత ద్వారా వారి వివరాలు తెలుసుకుంటారు. నిరుడు 2,955 మంది చిన్నారులను రక్షించారు. వారిలో 2,602 మందిని తల్లిదండ్రుల చెంతకు, మిగిలిన వారిని రెస్క్యూ హోమ్స్లో చేర్చారు. గత ఏడాది 394 కేసులు నమోదవ్వగా, ఈ ఏడాది ఇప్పటికే వందకుపైగా ఎఫ్ఐఆర్లు నమోదైనట్టు ఉన్నతాధికారులు తెలిపారు.