నారాయణపేట : ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పనిమంతులకు పట్టం కట్టండి.. కేసీఆర్ నాయకత్వంలో తిరిగి హ్యాట్రిక్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. నారాయణపేట జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
పాలమూరు ఎత్తిపోతలకు కేంద్రం అడ్డుపడ్డా కూడా ఆ పని పూర్తి చేసి ఈ ప్రాంత రైతులకు నీళ్లు అందించే బాధ్యత కచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వానిదే అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇందులో ఎవరికి ఎలాంటి అనుమానం అవసరం లేదు. అవసరమైతే న్యాయపోరాటం చేద్దాం. ప్రజాకోర్టులో తేల్చుకుందాం అని కేటీఆర్ చెప్పారు. వీళ్లందరిని మట్టి కరిపించి, 2024లో కేంద్రంలో మనకు అనుకూలంగా వచ్చే ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం. రైతు, పేద వ్యతిరేకులను, మతం పేరిట పంచాయితీ పెట్టి.. నాశనం చేసే వారిని తిప్పితిప్పి కొడుదాం అని కేటీఆర్ పేర్కొన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు మహబూబ్నగర్లో జరుగుతున్నాయని తెలిసింది. అక్కడ సొల్లు పురాణం మాట్లాడుతున్నారు. నారాయణపేట వేదికగా డిమాండ్ చేస్తున్నా. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదిన్నర సంవత్సరాలు దాటి పోయింది. ఎప్పుడైనా అన్నదమ్ముళ్లు వేరుపడితే ఆస్తిపంపకాలు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. తెలుగు రాష్ట్రాలు రెండు అయ్యాయి. రాష్ట్రం వేరు పడక ముందు 811 టీఎంసీల వాటా మనకు ఉందని ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. ట్రిబ్యునల్కు లేఖ రాసేందుకు కేంద్రానికి, మోదీకి సమయం దొరకడం లేదట. పంచాయితీని సెటిల్ చేసే ఉద్దేశం వారికి లేదు. ఎందుకంటే పాలమూరు ఎండాలి. ఎండితేనే కడుపు మండి ఉన్న ప్రభుత్వం మీద తిరగబడి మాకు అవకాశం ఇస్తారనే దురాలోచనతో ఉన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు వీటి కోసం తెలంగాణ ఉద్యమం జరిగింది. 95 శాతం లోకల్ రిజర్వేషన్లు తీసుకొచ్చి 2 లక్షల 20 వేల మందికి ఉద్యోగాలు కల్పించాం. అదే విధంగా నిధుల విషయంలో భారీగా విడుదల చేస్తున్నాం. తెలంగాణ రాకముందు వ్యవసాయం ఎలా ఉండేది. ఇప్పుడు ఎలా ఉందనే విషయాన్ని ఆలోచించాలి. పాలమూరు ఎత్తిపోతల పథకానికి కాంగ్రెస్, బీజేపీ నాయకులు అడ్డుకట్ట వేసినప్పటికీ, కోర్టుల్లో కేసులు వేసినప్పటికీ నీళ్ల పంపకాలను తేల్చకపోయినప్పటికీ 11 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాం అని కేటీఆర్ తెలిపారు.
కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని కేటీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై కేంద్రానికి ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా, లేఖలు రాసిన స్పందన లేదన్నారు. దున్నపోతు మీద వాన పడ్డట్టే తప్ప స్పందన లేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే.. మహబూబ్నగర్ జిల్లా మీద ప్రేమ ఉంటే.. పాలమూరులో నిర్వహిస్తున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో తీర్మానం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కోరుతున్న విధంగానే 500 టీఎంసీల కేటాయించాలని మోదీని డిమాండ్ చేస్తూ తీర్మానం చేయండి. దమ్ము, తెగువ ఉంటే ఆ తీర్మానం చేసి మీ చిత్తశుద్ది రుజువు చేసుకోండి అని సవాల్ విసిరారు. కేసీఆర్ను విమర్శించడం కాదు. పాలూమరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయో హోదా ఇవ్వాలని మోదీని డిమాండ్ చేయండి అని కేటీఆర్ అన్నారు.