హైదరాబాద్ : రాష్ట్రంలోని లబ్ధిదారులందరికీ రైతుబంధు జమ చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. రైతుబంధుపై ఆంక్షలు పెడుతామని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఎలాంటి ఆంక్షలు లేవని ఆయన తేల్చిచెప్పారు. ఎక్కువ భూమి ఉన్న వారికే రైతుబంధు అనేది అవాస్తవం అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రైతుబంధును స్వీకరిస్తున్న రైతులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఇవాళ మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 9వ విడుత రైతుబంధు కింద లబ్ధిదారులకు రూ. 7,508 కోట్లు అందిస్తున్నామని తెలిపారు. ఇవాళ రెండు ఎకరాల్లోపు ఉన్న 16.32 లక్షల మందికి రైతుబంధు నగదును జమ చేశామని పేర్కొన్నారు. 24.68 లక్షల ఎకరాలకు రూ. 1,234.09 కోట్లు జమ చేశామని ప్రకటించారు. ఈ రెండు రోజుల్లో ఎకరా, రెండు ఎకరాలు ఉన్న వారికి రూ. 1820.75 కోట్లు జమ చేశామన్నారు. ఈ రెండు రోజుల్లో మొత్తం 36.41 లక్షల ఎకరాలకు ఆర్థిక సాయం అందిందని తెలిపారు. 10 ఎకరాలకు పైగా ఉన్న లబ్ధిదారులకు అందిస్తుందని రూ. 250 కోట్లు మాత్రమే అని స్పష్టం చేశారు. రైతుబంధు లబ్ధిదారుల్లో ఐదు ఎకరాలు ఉన్న వారు 92.50 శాతం మంది ఉన్నారు. ఈ ఏడాది వానాకాలంలో 68.10 లక్షల మందికి రైతుబంధు అందిస్తున్నామని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలోనూ రైతులకు చేసిందేమీ లేదని నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన మోదీ.. ఎరువులు, పెట్రోల్, డీజిల్ ధరలను మాత్రం రెట్టింపు చేశారని మండిపడ్డారు. 60 ఏండ్లు నిండిన రైతులకు పెన్షన్ ఇస్తామని చెప్పిన కేంద్రం హామీ నెరవేరడం లేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.