Vinod Kumar | ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవాలని, నీరే భవిష్యత్తుకు జీవనాధారమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఆదివారం నీటి ప్రాముఖ్యతపై చేపట్టిన జన చైతన్య ప్రచార యాత్రను మంత్రుల నివాస ప్రాంగణంలో వినోద్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. మంత్రుల నివాసంలోని క్లబ్ హౌస్లో నీటి ప్రాముఖ్యతపై ఏర్పాటు చేసిన సదస్సు, రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి కవిత్వ ఉత్సవంలో వినోద్ కుమార్ మాట్లాడారు.
నీటిని సంరక్షిస్తేనే భవిష్యత్తు ఉంటుందని, ఈ వాస్తవాన్ని ప్రతి ఒకరూ గ్రహించాలని సూచించారు. సమస్త ప్రాణ కోటికి, చెట్లకు, ముఖ్యంగా మానవ మనుగడకు నీటి ఆవశ్యకత ఎంతో కీలకమని తెలిపారు. నీటి సంరక్షణ కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎన్నో గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో సుమారు 44వేల చెరువుల్లో పూడికలు తీయించారని, తద్వారా భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు. కేంద్ర జల సంఘం లెకల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలోని భూగర్భంలో దాదాపు 500 నుంచి 600 టీఎంసీల నీరుభద్ర పరిచినట్టు తెలిపారు. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లను పంట పొలాలకు, చెరువులు, కుంటలకు తరలించడం వల్ల గ్రౌండ్ వాటర్ గణనీయంగా పెరిగిందని గుర్తు చేశారు.
నీటి ప్రాధాన్యతను ఎవరూ మరిచిపోవద్దని, నీటిని వృథా చేస్తే రేపటి తరానికి మిగిలేది కన్నీరేనని తెలిపారు. అనంతరం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థల ప్రచురణలను వినోద్ కుమార్ ఆవిషరించి కవులను సన్మానించారు. కార్యక్రమానికి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ సంస్థల చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఆ సంస్థల ప్రధాన కార్యదర్శి డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి, జల మండలి ఓఎస్డీ జాల సత్యనారాయణ, గాంధీ సంస్థల ప్రతినిధులు నాగసూరి వేణు గోపాల్, గిరిధర్ గౌడ్, గోపాల్, గణేశ్ గౌడ్, గాంధారి ప్రభాకర్, హర్దీప్ రెడ్డి, రెండు తెలుగు రాష్ట్రాల కవులు పాల్గొన్నారు.