హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కేంద్రంలోని మోదీ సర్కారు రాష్ట్రంపై అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నది. బీజేపీ పాలిత రాష్ర్టాలకు అడిగిన దానికంటే ఎక్కువ నిధులిస్తున్న మోదీ సర్కారు.. తెలంగాణపై మాత్రం అంతులేని వివక్ష చూపుతున్నది. ప్రత్యేకించి గ్రాంట్-ఇన్-ఎయిడ్ విషయంలో ఈ వివక్ష మరీ అధికంగా ఉన్నది. మార్చి నెలాఖరుతో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో కేంద్రం నుంచి గ్రాంట్ రూపేణా రూ.41,259 కోట్లు అందుతాయని మన రాష్ట్ర బడ్జెట్లో అంచనా వేయగా.. మూడో త్రైమాసికం నాటికి మోదీ సర్కారు రూ.4,533 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఇది రాష్ట్ర అంచనాలో కేవలం 11 శాతమే. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కేంద్రం నుంచి అందే గ్రాంట్ రాష్ట్ర అంచనాలో 25 శాతానికి మించకపోవచ్చని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్కు కేంద్రం ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా అంచనాకు మించి భారీగా నిధులిచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రూ.16,290 కోట్ల గ్రాంట్ వస్తుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా.. మూడో త్రైమాసికం చివరి నాటికే మోదీ సర్కారు రూ.16,582 కోట్లు అందించింది. ఇది ఆ రాష్ట్ర అంచనాలో 102 శాతానికి సమానం. ఈ లెక్కన ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కేంద్రం గుజరాత్కు అందించే గ్రాంట్ మరో రూ.5-6 వేల కోట్ల వరకు ఉంటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. తెలంగాణతో పోలిస్తే మోదీ ప్రాతినిధ్య రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కు కూడా కేంద్రం ఆశాజనకంగానే నిధులు అందించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రూ.1,01,203 కోట్ల గ్రాంట్ అందుతుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా.. డిసెంబర్ చివరినాటికి మోదీ సర్కారు రూ. 26,372 కోట్లు ఇచ్చింది. ఇది ఆ రాష్ట్ర అంచనాలో 26 శాతానికి సమానం.