BJP-Congress | హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఎన్నికల షెడ్యూల్ విడుదల తేదీ సమీపిస్తున్నా కాంగ్రెస్, బీజేపీలు ఇంకా అభ్యర్థుల వేటలో సిగపట్లు పడుతున్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి, ప్రచారంలో దూసుకెళ్తున్నది. ఈ తరుణంలో తమ పార్టీలు ఇంకా అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు, సమీక్షలు, అభిప్రాయ సేకరణలు అంటూ కాలయాపన చేస్తున్నాయనే అసహనం కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నది.
తేలని సమీకరణలు
కాంగ్రెస్ పార్టీ బయటికి గంభీర ప్రకటనలు చేస్తున్నా లోలోలన కుట్రలు, కుతంత్రాలతో సతమతం అవుతున్నది. అభ్యర్థుల ఎంపికకు ‘ధర’కాస్తుల స్వీకరణ ప్రక్రియను ఎప్పుడో చేపట్టినా ఇప్పటికీ ఖరారు చేయలేని దుస్థితి. బీజేపీదీ అదే పరిస్థితి. కిషన్రెడ్డి రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేపట్టిన తరువాత అనేక గ్రూపులు తెరమీదకి వచ్చాయి. పార్టీలో ఇటీవల చేరిన అనేకమంది నేతలు వేరుకుంపట్లు పెట్టుకున్నారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో 105 నియోజకవర్గాల్లో డిపాజిట్లు గల్లంతు అయిన బీజేపీకి ఈసారి అంతకంటే దారుణమైన ఫలితాలు తప్పవని గ్రహించిన నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. చివరకు కిషన్రెడ్డి సొంత నియోజకవర్గం అంబర్పేటలో ఆయనకు కుడిభుజంగా పనిచేసిన నాయకుడే బీఆర్ఎస్లో చేరడం ఇందుకు నిదర్శనం.
అభ్యర్థుల కరువు
కాంగ్రెస్, బీజేపీకి రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజాభిమానం ఉన్న, సమర్థులైన అభ్యర్థులు దొరకని పరిస్థితి. దీంతో అభిప్రాయ సేకరణ, సమీకరణల పేరుతో అధిష్ఠానం కాలయాపన చేస్తున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటిస్తే టికెట్ దక్కని అసంతృప్తులు తమ వైపు వస్తారని కాంగ్రెస్, బీజేపీ నేతలు తొలుత భావించారు. ఆ ఆశ తీరలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బీ ఫారం ఇచ్చే వరకు వేచి చూద్దామన్న ధోరణితో వ్యవహరిస్తుండటం ఆ పార్టీల దుస్థితిని తెలియజేస్తున్నది. ‘ఇంకా టైముంది కదా.
ఇప్పుడే తొందరేమొచ్చింది. బీఆర్ఎస్ బీ ఫాంలు ఇవ్వనీ’ అని ఇటీవల టికెట్ విషయమై నిలదీసిన ఒక నేతతో రేవంత్రెడ్డి వ్యాఖ్యానించినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి సమర్థులైన అభ్యర్థులు లేరనడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీలోనూ అదే వాతావరణం నెలకొన్నది. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాన్ని ప్రభావితం చేయగల నాయకులు పట్టుమది పది మంది కూడా లేరు. అలాంటిది అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలిపేదెట్లా? అని కిషన్రెడ్డి తలపట్టుకున్నట్టు సమాచారం.