లంకె బిందెలు ఉన్నాయని అనుకుంటే.. ఇక్కడ ఖాళీ కుండలు కనిపిస్తున్నయి
– డిసెంబర్లో సీఎం రేవంత్రెడ్డి కామెంట్
రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది.. మీరే సహకరించాలి
-కేంద్రం వద్ద సీఎం బీద అరుపులు
ఆదాయం కన్నా చెల్లింపులే ఎక్కువగా ఉన్నాయి. రైతుబంధు, రుణమాఫీ వంటివి ఆలస్యం అవుతాయి.
-ప్రభుత్వం చెప్తున్న మాటలివి
ఖజానా ఖాళీగా ఉంది.. బిల్లులు చెల్లించే పరిస్థితి లేదు
– కాంట్రాక్టర్లకు, ఇతరులకు అధికారుల సమాధానం
Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : కానీ వాస్తవ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉన్నది. డిసెంబర్ నుంచి రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగిందని గణాంకాలు చెప్తున్నాయి. ఫిబ్రవరి నాటికి మూడు నెలల్లోనే అదనంగా రూ.4వేల కోట్ల మేర అదనపు ఆదాయం వచ్చినట్టు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం పన్నుల వసూలు, జరిమానాలపై ప్రధానంగా దృష్టి సారించింది.
ఇసుక, మద్యం, జీఎస్టీ తదితర ఆదాయ మార్గాలను పెంచే పనిని మొదలు పెట్టింది. వసూళ్లను కఠినతరం చేయాలని సంబంధిత శాఖలకు, అధికారులకు లక్ష్యాలను నిర్దేశించింది. దీంతో అధికారులు ముక్కుపిండి వసూలు చేస్తుండటంతో రాష్ట్ర ఖజానాకు రాబడి పెరిగినట్టు చెప్తున్నారు. గతంలో ప్రతి నెల రాష్ట్ర ఆదాయం సుమారు రూ.10వేల కోట్ల వరకు వచ్చేదని అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన విధానాల ఫలితంగా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో సగటున 12 శాతం మేర ఆదాయం పెరిగినట్టు సమాచారం. మూడు నెలల్లోనే రాబడి రూ.34 వేల కోట్లు దాటిందని ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో ఏకంగా రూ.13వేల కోట్ల మార్కు దాటిందని అంటున్నారు. మార్చిలో కూడా ఇదే స్థాయిలో రాబడి ఉంటుందని చెప్తున్నారు.
శాఖల వారీగా లక్ష్యాలు..
ప్రజలపై పన్ను భారం మోపకుండా.. ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటామని, రాబడులను క్రమబద్ధీకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో చెప్పారు. శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకొని వసూలుపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ట్రాన్స్పోర్ట్, మైన్స్ అండ్ మినరల్స్ తదితర శాఖలకు లక్ష్యాలను నిర్దేశించారు. జీఎస్టీ పన్ను పరిధిలో ఉన్నవారిపై తనిఖీలకు మొబైల్ ఎన్ఫోర్స్మెంట్ యూనిట్లను పెంచడమే కాకుండా విజిలెన్స్ నిఘా, ఇంటెలిజెన్స్ నెట్వర్క్ను మరింత కట్టుదిట్టం చేసింది.
జీఎస్టీ అవకతవకలపై దాడులను ఉద్ధృతం చేశారు. గతంలో కేటాయించిన అనేక మైనింగ్ లీజులను ప్రభుత్వం రద్దు చేసింది. అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. చిన్నా చితకా లోపాలను కూడా వదలకుండా ఇసుక లారీలకు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. వీటిని వెంటనే చెల్లించకపోతే మైనింగ్కు అనుమతులు పునరుద్ధరించేదిలేదని స్పష్టం చేస్తున్నారు. ఇసుక రవాణా వాహనాలకు జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి కఠిన చర్యల నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో దళారులు బ్లాక్మార్కెట్లో ఇసుకను రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు.
ఎక్సైజ్ అధికారులు ఇతర రాష్ర్టాల నుంచి అక్రమంగా దిగుమతి అవుతున్న నాన్డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎస్డీపీఎల్)పై కొరడా ఝుళిపిస్తున్నారు. ప్రతి డిస్టలరీ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతోపాటు లిక్కర్ను డెలివరీ చేసే వాహనాలకు జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. లిక్కర్ సరఫరా వాహనాల వేబిల్స్ను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఫలితంగా ఆదాయం గణనీయంగా పెరిగినట్టు ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నాయి.