హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనకు ముందే బీజేపీలో ముసలం పుట్టింది. తమకు పదవులు కావాలంటూ నేతలంతా ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ రాజకీయం మొత్తం అధ్యక్ష పదవి చుట్టూ తిరుగుతున్నది. కొత్తగా వచ్చే వారికేనా పదవులు? మా సంగతేంటి? అని ఏండ్ల తరబడి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతలు ప్రశ్నిస్తున్నారు. దీంతో రాష్ట్ర బీజేపీ ఇప్పుడు కొత్త, పాత నేతలగా విడిపోయింది.
తమకేం పదవి కావాలో ముందే ఓ నిర్ణయానికి వస్తున్న నేతలు ఢిల్లీ వెళ్లి తమకు అది ఇస్తేనే ఉంటామని, లేదంటే తమ దారి తాము చూసుకుంటామంటూ అల్టిమేటం జారీ చేస్తుండడం చూసి అధినాయకత్వమే విస్తుపోతున్నది. పార్టీపై పట్టుకోసం ప్రయత్నిస్తున్న కొత్త నేతలు.. అధ్యక్ష పదవికి బండి సంజయ్ అసమర్థుడని, తమకు అప్పగిస్తే పార్టీని పరుగులు పెట్టిస్తామని అధిష్ఠానం వద్ద గప్పాలు కొడుతున్నారు. మరోవైపు, తనకు అధ్యక్ష పదవి కానీ, ప్రచార కమిటీ బాధ్యతలు కానీ అప్పగిస్తేనే ఉంటానని, లేదంటే లేదని ఈటల రాజేందర్ తెగేసి చెప్పినట్టు తెలుస్తున్నది. రఘునందనరావు కూడా పదవిని ఆశిస్తున్నట్టు ఆయన తాజా వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఈ వరుస పరిణామాలతో పార్టీలో బండి సంజయ్ ఒంటరిగా మారారు. తాజా పరిణామాలతో తీవ్ర అసంతృప్తికి గురవుతున్న సీనియర్ నాయకులు కొత్త నేతలతో పార్టీకి ముప్పేనని హెచ్చరిస్తున్నారు. మోదీ రాకకు ముందే నేతలు ఇలా పదవుల కోసం వెంపర్లాడుతుండడం చూసి ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.