Etamatam | ఎన్నికల ప్రచారం ముగిసేందుకు ఇంకా పట్టుమని వారం రోజులు కూడా లేదు. మరి ఇంకెప్పుడు ప్రచారానికి వెళ్తారని డబుల్ ఇంజిన్ పార్టీలో కిషన్రెడ్డి గురించి సీరియస్గా చర్చ జరుగుతున్నది. ‘అసలు ఆయనకు ప్రచారానికి వెళ్లే ఉద్దేశం ఉన్నదా?, లేదా? లేక డబుల్ ఇంజిన్కు డీజిల్ దండుగ అనుకుంటున్నారా?’ అని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారట. ‘వెళ్లడానికి అభ్యంతరం లేదు కానీ.. పిలవని పేరంటానికి వెళ్తే ఏం బాగుంటుంది చెప్పమ’ని కిషన్రెడ్డి ఎదురు ప్రశ్నిస్తున్నారట.
‘సీత కష్టాలు సీతవి.. పీత కష్టాలు పీతవి. నా పరిస్థితి మీకు అర్థం కాదులే!’ అని తన సన్నిహితుల దగ్గర వాపోతున్నారట. ‘తెలంగాణలో వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కారే అని బడా నేతలంతా భాషణలు దంచి వెళ్తుంటే, మీరు హైదరాబాద్ విడిచి కదలకుంటే ఎలా? ప్రచారానికి ఎవరు వెళ్లినా వెళ్లకపోయినా పెద్దగా ఫరక్ పడదు కానీ.. కనీసం జనాలైనా ఏమనుకుంటారో ఆలోచించాల’ని సీనియర్లు నిష్ఠురంగా మాట్లాడుతున్నారట. ఎన్నికల షెడ్యూల్ వచ్చాకేమో దసరా తర్వాత వెళ్తానన్న కిషన్ జీ.. అది వెళ్లాక దీపావళి, అమావాస్య దాటాక వెళ్తానని ప్రెస్మీట్ పెట్టి మరీ ప్రకటించారు. ఇప్పుడేమో కార్తిక పున్నమి.. దివ్యమైన ముహూర్తం అప్పుడు బయలుదేరుతానని చెబుతున్నారు. ఈ నెల 28న ఎలాగూ ప్రచారం ముగియనుండగా .. మిగిలేది రెండు రోజులే. అప్పుడు రాష్ట్రమంతా ఎలా తిరుగుతారని అడుగుతున్నారట. అసలు ఆయన ఎందుకిలా వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారని ఆరా తీస్తే, అసలు విషయం బయటపడింది.
రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ని మార్చడం వల్ల పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయిందని, పరిస్థితి బాగా లేనప్పుడు పోటీ చేసి పరువు పోగొట్టుకునే కంటే చేయకపోవడమే బెటర్ అని డీకే అరుణ, జితేందర్రెడ్డి, మురళీధర్రావు, కొండా విశ్వేశ్వర్రెడ్డి తదితర ముఖ్యనేతలంతా అస్త్ర సన్యాసం చేశారు. ఇతర నేతలు కూడా పోటీకి పెద్దగా ఆసక్తి చూపకపోయినప్పటికీ, ఏదో కొందరిని బతిమాలి, బామాలి బరిలోకి దింపితే, వారేమో మాట వరుసకైనా ప్రచారానికి రమ్మని కిషన్రెడ్డిని పిలవడం లేదట. దీంతో పిలవని పేరంటానికి వెళ్లడం కంటే నొప్పింపక తానొప్పక తప్పించుకు తిరగడమే బెటర్ అని ఫిక్సయినట్టున్నారు కిషన్జీ.
– వెల్జాల