హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పరిసరాల్లో డ్రోన్ పోర్టు ఏర్పాటుకు 20 ఎకరాలు కేటాయించాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. డ్రోన్ పైలెట్లకు శిక్షణ ఇచ్చేందుకు స్థలం కేటాయించాలని ఏవియేషన్ అకాడమీ అధికారులు విజ్ఞప్తి చేయడంతో ఆయన ఈ ఆదేశాలు జారీచేశారు. డ్రోన్ పైలెట్లకు అధునాతన శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి, ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ సమక్షంలో తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈవో ఎస్ఎన్రెడ్డి, ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్ ప్రకాశ్ హన్ ఈ ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా డాటా అనాలసిస్, డాటా ప్రాసెసింగ్, మ్యాపింగ్పై ఎన్ఆర్ఎస్సీ శాస్త్రవేత్తలకు, అకాడమీలో శిక్షణ పొం దుతున్న డ్రోన్ పైలెట్లకు 15 రోజుల శిక్షణ కోర్సులు నిర్వహిస్తారు.
ప్రస్తుతం అన్ని రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరిగిందని, పొలాల్లో ఎరువులు, పురుగు మందులను చల్లేందుకు రైతులు డ్రోన్లను వినియోగిస్తున్నందున ఉన్నత స్థాయి నుంచి తాసిల్దార్ స్థాయి ప్రభుత్వ అధికారులకు కూడా డ్రోన్లపై అవగాహన కల్పించేందుకు శిక్షణ ఇవ్వాలని సీఎం సూచించారు. ఇస్రో చైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ.. దేశంలోనే వినూత్నంగా తెలంగాణ ప్రభుత్వం డ్రోన్ పైలట్లకు శిక్షణ కోర్సు నిర్వహిస్తున్నదన్నారు. దేశంలో 12 సార్లు బెస్ట్ ఏవియేషన్ అవార్డును అందుకున్న తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సేవలను ఆయన ప్రశంసించారు. ప్రస్తుతం డ్రోన్ పైలెట్లకు ఎయిర్పోర్టులోనే శిక్షణ ఇస్తున్నామని, అకడ రద్దీ పెరిగినందున హైదరాబాద్ పరిసరాల్లో ప్రత్యేకంగా స్థలం కేటాయించాలని ఏవియేషన్ అకాడమీ అధికారులు కోరారు. పైలెట్ల శిక్షణతోపాటు డ్రోన్ల తయారీ కంపెనీలు తమ ట్రయల్స్ నిర్వహించుకునేందుకు డ్రోన్ పోర్టు ఉపయోగపడుతుందని తెలిపారు. దీనిపై సీఎం రేవంత్రెడ్డి స్పందిస్తూ.. డ్రోన్ పోర్టుకు అవసరమైన 20 ఎకరాలను ఫార్మాసిటీ వైపు అన్వేషించాలని, ఏవియేషన్ నిబంధనల ప్రకారం అభ్యంతరం లేని జోన్లో స్థలం కేటాయించాలని అధికారులకు సూచించారు.
వరంగల్ ఎయిర్పోర్టును పునరుద్ధరించాలి
వరంగల్ ఎయిర్పోర్టు పునరుద్ధరణకు తగిన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. పాడైన పాత రన్వేలను కొత్తగా నిర్మించటంతోపాటు అకడి నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని సూచించారు. అడ్డంకులేమైనా ఉంటే పరిషరించాలని స్పష్టం చేశారు. కొత్తగూడెం, భద్రాచలం పరిసర ప్రాంతాలు కూడా ఎయిర్పోర్టు ఏర్పాటుకు అనువుగా ఉంటాయని, అకడున్న అవకాశాలను పరిశీలించి ఎయిర్ పోర్టు అథారిటీతో సంప్రదింపులు జరపాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, ఆర్అండ్బీ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీనివాసరాజు, ఎన్ఆర్ఎస్సీ డిప్యూటీ డైరెక్టర్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.