చర్ల, మార్చి 21: వారిద్దరూ అభాగ్యులు.. ఒక బాలిక చిన్నవయస్సులోనే తల్లిని పోగొట్టుకుంటే.. మరో బాలిక తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయింది. సమీప బంధువులు చొరవతో ఇద్దరు బాలికలు ఒక దగ్గర చదువుకుంటున్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై వారిని చదివించేందుకు ముందుకు వచ్చారు. వివరాలు ఇలా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం దానవాయిపేటకు చెందిన వేల్పుల శిరీష తల్లి కొన్నేండ్ల క్రితం కాలం చేసింది.
ఆమె అలనా పాలనా చూసే వారులేక తండ్రి నారాయణ చర్ల కేజీబీవీలో చేర్పించాడు. శిరీష ప్రస్తుతం పదోతరగతి చదువుతున్నది. అలాగే బోదనూరుకు చెందిన మడకం అనిత తల్లిదండ్రులిద్దరూ కొన్నేండ్ల క్రితం కాలం చేశారు. ఆమె బాగోగులు చూసే వారు లేకపోవడంతో మేనమామ అనితను చర్ల కేజీబీవీలో చేర్పించాడు. ప్రస్తుతం అనిత తొమ్మిదో తరగతి చదువుతున్నది. ఇటీవల సత్యమార్గ్ అనే స్వచ్ఛంద సంస్థ కేజీబీవీ విద్యార్థినులకు స్టడీ మెటీరియల్ సమకూర్చింది.
ముఖ్యఅతిథిగా హాజరైన చర్ల ఎస్సై టీవీఎస్ సూరి వారికి స్టడీ మెటీరియల్ అందించారు. ఈ క్రమంలో ఎస్సై, కేజీబీవీ ఎస్వో సరోజ మాట్లాడుకుంటుండగా శిరీష, అనిత ప్రస్తావన వచ్చింది. వారిద్దరి పరిస్థితిని తెలుసుకున్న ఎస్సై వెంటనే స్పందించారు. బాలికలిద్దరిని తన సొంత ఖర్చులతో చదివిస్తానని ముందుకు వచ్చారు. ఎస్సై చొరవను ఎస్వోతో పాటు చర్లవాసులు అభినందించారు. విద్యార్థినులు సైతం సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.