హైదరాబాద్: దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అది ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) అని టీఎస్ఎంఎస్ఐడీసీ (TSMSIDC) చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ (Errolla Srinivas) అన్నారు. తెలంగాణ ప్రజలకు కించపర్చేలా మాట్లాడితే ఇక్కడికి రావొద్దని చెప్పారు. ఏపీ నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని వెల్లడించారు. దేశానికి తెలంగాణ (Telangana) రోల్ మోడల్ అని తెలిపారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంపై దండయాత్ర చేసి దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మీకు తెలంగాణ రాష్ట్రంపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.
ఉమ్మడి ఏపీలో ఏపీపీఎస్సీని చీపీపీఎస్సీ అని మీడియా, పత్రికలు రాసిన వార్తలు మర్చిపోయారా అని బొత్స సత్యనారాయణను ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని గురుకుల పాఠశాలలు, డిగ్రీ కాలేజీలు ఉన్నాయో చెప్పాలన్నారు. మీ పాలనలో 60 ఏండ్ల కాలంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఎందుకు కట్టలేదని నిలదీశారు. మీరు రాజకీయ విమర్శలు చేస్తే ఆంధ్ర రాష్ట్రంలో చేసుకోవాల కానీ, తెలంగాణ గురించి మాట్లాడితే ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హితవుపలికారు. ఇలాగే మాట్లాడితే హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో దిగనివ్వమని స్పష్టం చేశారు.
తెలంగాణ సమాజంపైన, సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంజినీరింగ్ విద్య బాగాలేదని.. ఏపీకి చెందిన 80 వేల మంది విద్యార్థులు తెలంగాణలో బీటెక్ కోర్సులు చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రం విడిపోయి పదేండ్లు కావొస్తున్నా ఇప్పటికీ రాజధాని దిక్కులేదని, అందుకే తెలంగాణ వైపు ఏపీ విద్యార్థులు వస్తున్నారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిని చూసి కేంద్రమే అవార్డులు ఇస్తున్నదని చెప్పారు.
అబద్ధాలతో బతికే వ్యక్తి ఎంపీ ధర్మపురి అరవింద్ (MP Arvind) అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్కు (Nizamabad) పసుపుబోర్డు (Turmeric board) తీసుకొస్తానని సంతకం చేశాడని, ఇప్పటికీ అది రాలేదన్నారు. దమ్ముంటే పసుపుబోర్డు గురించి మాట్లాడాలని సవాల్ విసిరారు. నిజామాబాద్ ప్రజలకు ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ (Medical colleges) కూడా ఇవ్వలేదని విమర్శించారు. అయినప్పటికీ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు కట్టుకున్నామని చెప్పారు. ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేశామని, ప్రజలకు సర్కారు వైద్యంపై నమ్మకం పెరిగిందన్నారు. వైద్యరంగంలో తెలంగాణ మూడో స్థానంలో ఉందని కేంద్రమే చెప్పిందని గుర్తుచేశారు.