Errolla Srinivas | మంత్రులు దొంగల ముఠాగా మారి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ వెంటపడుతాం.. వేటాడుతామన్నారు. హామీలు అమలు చేయని పార్టీ, మంత్రులపై చీటింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు గతంలో ఉద్యమంలో పాల్గొన్నాడనే గౌరవం ఉండేదని.. కేసీఆర్, హరీశ్రావులపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా పని చేసిన విషయాన్ని ఆయన మరిచిపోయినట్లున్నారన్నారు. ఐదేళ్లు మంత్రిగా పాలమూరుపై గుత్తాధిపత్యం చెలాయించారని.. తమపై విమర్శలు చేసే ముందు జూపల్లి ఓసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవుపలికారు. ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు.
మంత్రిగా జూపల్లి ఆనాడు కేసీఆర్ను ఎంతగ పొడిడారో గుర్తు చేసుకోవాలన్నారు. పాలమూరుకు కరువును కేసీఆర్ శాశ్వతంగా దూరం చేశారని.. కేసీఆర్ పాలనకంటే ముందు పాలమూరు ఎలా ఉండేదో గుర్తు చేసుకోవాలన్నారు. రుణమాఫీపై చేతులెత్తేశారన్నారు. జూపల్లి మంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ గురించి మాటలు వింటే ఇప్పుడు జూపల్లి తలకాయ ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టుల కింద కేసీఆర్ హయాంలో ఆరు లక్షలకు పైగా ఎకరాలకు నీళ్లిచ్చిన సంగతి జూపల్లికి తెలియదా? అంటూ ప్రశ్నించారు. ప్రజాపాలనను పక్కకు పెట్టి అవినీతి పాలనను మొదలుపెట్టారన్నారు. పాలమూరు జిల్లాకు కేసీఆర్ నీళ్లిచ్చారా? 50 సంవత్సరాల కాంగ్రెస్ ఇచ్చిందా? 100 రోజుల కాంగ్రెస్ ఇచ్చిందా చర్చకు సిద్ధమా జూపల్లి ? అంటూ ఎర్రోళ్ల శ్రీనివాస్ సవాల్ విసిరారు. రేవంత్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల పై చర్చకు సిద్ధమా ? వందరోజుల పాలనలో వెయ్యి అబద్ధాలు ఆడారన్నారు. హామీలు అమలు చేయని ముఖ్యమంత్రి, కేబినెట్పై చీటింగ్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.