హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఎర్రోళ్ల శ్రీనివాస్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఎర్రోళ్లకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఉద్యమ కారుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ను టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్గా సీఎం కేసీఆర్ నియమించడం సంతోషకరమన్నారు.
ఆరోగ్య తెలంగాణగా రాష్ట్రం మారాలన్నది సీఎం కేసీఆర్ కల. పేషంట్లకు త్వరిత గతిన ఆరోగ్య పరీక్షలు, మందులు అందించే ఒక గొప్ప బాధ్యత ఇప్పుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ మీద ఉంది. తను చురుకుగా ఉండి, తన సంస్థను మరింత ముందుకు సమర్థవంతంగా నిర్వర్తించి కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టాలన్నారు.
ఇంతకు ముందు తన దైన శైలిలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గా శ్రీనివాస్ అద్భుతంగా పని చేశారు. ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణలో కీలకంగా వ్యవహరించారు. అదే రీతిలో ఇప్పుడు వైద్య సదుపాయాలు కల్పించే కీలకమైన సంస్థ టీఎస్ఎంఎస్ఐడీసీ కూడా సమర్థవంతంగా నడిపించాలన్నారు.
సాధారణంగా మనకు ప్రభుత్వ దవాఖానల్లో బిల్డింగ్లు, మెడికల్ డివైసెస్, ఎక్స్ రేలు, టెస్టింగ్ ల్యాబ్లు, ఇంజక్షన్లు, బెడ్లు మాత్రమే కనిపిస్తాయి. కానీ అవి సమకూరడానికి శ్రమించేది, సమకూర్చేది టీఎస్ఎంఎస్ఐడీసీ సంస్థనే అన్నారు.
దవాఖానల భవన నిర్మాణా పనులు, అవసరమైన ఫర్నిచర్, మందులు, సర్జికల్ ఎక్విప్మెంట్, వైద్యానికి అవసరమైన కాటన్, డయాగ్నస్టిక్ ఎక్విప్మెంట్స్, మెడికల్ ఎక్విప్మెంట్ నిర్వహణ, శానిటైజెషన్, హాస్పిటల్ భద్రతకు అవసరమైన సెక్యూరిటీ ఏర్పాట్లు, వైద్యో ఆరోగ్య శాఖకు అవసమరైన అన్ని సదుపాయాలు కల్పించేది ఈ సంస్థ ద్వారానే అని మంత్రి తెలిపారు.
ఒక్క మాటలో చెప్పాలంటే సూది నుంచి సీటీ స్కాన్ మిషన్ వరకు సమకూర్చేది ఈ సంస్థే.
మహబూబ్ నగర్, సిద్దిపేట జిల్లాల్లో మెడికల్ కాలేజీలు టీఎస్ఎంఎస్ఐడీసీ నిర్మించింది.
సిరిసిల్లలో నర్సింగ్ కాలేజీని నిర్మించింది. ఎం.ఎన్. జే క్యాన్సర్ దవాఖానలో మాడ్యులర్ థియెటర్ నిర్మాణ పనులు ఈసంస్థ ద్వారానే జరుగుతున్నాయని తెలిపారు.
గుండె సమస్యలు ఉన్న వారిని కాపాడుకునేందుకు గాంధీ, ఉస్మానియా, నిమ్స్, ఎంజీఎంలలో, ఖమ్మం, ఆదిలాబాద్ దవాఖానల్లో విలువైన క్యాథ్ ల్యాబ్లను ఏర్పాటు చేసుకుంటున్నాం. టీఎస్ఎంఎస్ఐడీసీ ద్వారా వీటన్నింటిని సమకూర్చుకుంటున్నామని మంత్రి తెలిపారు.
ఇలాంటి కీలక సంస్థను శ్రీనివాస్ మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలని మంత్రి హరీశ్రావు ఆకాంక్షించారు. ఉద్యమ కారుడు ఎర్రోళ్లకు ఈ బాధ్యతలు అప్పజెప్పిన సీఎం కేసీఆర్కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.