Errabelli Dayaker Rao | జనగామ : తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిప్పులు చెరిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయమన్నారు. జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జెడ్పీ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డితో కలిసి మంత్రి దయాకర్ రావు మీడియాతో మాట్లాడారు.
రేవంత్ రెడ్డి డబ్బులకు అమ్ముడుపోయి టికెట్లు అమ్ముకుంటూ, పొన్నాల లక్ష్మయ్య లాంటి సీనియర్లపై విమర్శలు చేయడం సరికాదన్నారు. దాదాపు 40 ఏండ్ల పాటు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేశారని తెలిపారు. పొన్నాలపై రేవంత్ నీచమైన మాటలను ఖండిస్తున్నాని పేర్కొన్నారు. దందాలు చేసే బ్రోకర్ రేవంత్ రెడ్డి.. ఒక మంచి వ్యక్తిని అలా అవమానించడం కరెక్టు కాదన్నారు. ఇక మంత్రి కేటీఆర్ను విమర్శించడానికి రేవంత్కు అర్హత లేదన్నారు. పెద్ద చదువులు చదువుకుని, అమెరికాలో మంచి కంపెనీలో ఉద్యోగం చేసిన వ్యక్తిని అవమానిస్తావా? అని ధ్వజమెత్తారు.
కేసీఆర్ను విమర్శించే అర్హత రేవంత్ రెడ్డికి లేదన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. రేవంత్లాగా తమకు రోత మాటలు రావు.. ఆయన తిమ్మిని బమ్మి చేస్తారని మండిపడ్డారు. సంవత్సరానికి ఒక పార్టీ మారే బతుకు రేవంత్ది అని ధ్వజమెత్తారు. కొడంగల్లో చిత్తుగా ఓడిపోయిన రేవంత్కు దమ్ముంటే.. రంగారెడ్డి జిల్లాలో పోటీ చేసి గెలవాలని దయాకర్ రావు సవాల్ విసిరారు. రేవంత్ రాగానే కాంగ్రెస్ పని ఖతమైందన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయిందని, 15న బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదలైన వెంటనే కాంగ్రెస్ మొత్తం పడిపోతుందన్నారు దయాకర్ రావు.