CM KCR | హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) సర్వీసును క్రమబద్ధీకరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియాను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశించారు. జేపీఎస్ల పనితీరు మదింపునకు జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని సీఎం సూచించారు. సోమవారం సచివాలయంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసు క్రమబద్ధీకరణపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లా కమిటీలో కలెక్టర్తోపాటు అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), జిల్లా ఫారెస్టు అధికారి, జిల్లా ఎస్పీ లేదా డీసీపీ మెంబర్లుగా ఉంటారు. దీనికి రాష్ట్రస్థాయి నుంచి ఒక సెక్రటరీ స్థాయి లేదా హెచ్వోడీ స్థాయి అధికారి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. రాష్ట్రస్థాయిలో పంచాయతీరాజ్శాఖ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీని వేస్తారు. జిల్లా కమిటీ పంపించిన ప్రతిపాదనను రాష్ట్రస్థాయి కమిటీ పరిశీలిస్తుంది. రాష్ట్ర కమిటీ చీఫ్ సెక్రటరీకి నివేదికను పంపిస్తుంది.
రాష్ట్రంలో కొన్ని గ్రామపంచాయతీల్లో తాతాలిక ప్రాతిపదికన జేపీఎస్లను జిల్లా కలెక్టర్లు నియమించారు. ఈ స్థానాల్లో కూడా కొత్త జేపీఎస్ల భర్తీ ప్రక్రియను, క్రమబద్ధీకరణ తర్వాతి దశలో ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సమావేశంలో మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, దేశపతి శ్రీనివాస్, పాడి కౌశిక్రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, బాల సుమన్, సీఎం ప్రధాన సలహాదారు సోమేశ్కుమార్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్శర్మ, సీఎస్ శాంతికుమారి, వివిధ శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. సీఎం నిర్ణయం నేపథ్యంలో జేపీఎస్ల సర్వీసు క్రమబద్ధీకరణ మార్గదర్శకాలపై పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సీఎస్ శాంతికుమారితో సచివాలయంలో భేటీ అయ్యారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియాతో చర్చించారు. నిబంధనలను అనుసరించి, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించే మార్గదర్శకాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. జేపీఎస్ల క్రమబద్ధీకరణకు అంగీకరించిన సీఎం కేసీఆర్కు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలిపారు.
కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు
సీఎం కేసీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయంపై ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. జేపీఎస్ల క్రమబద్ధీకరణకు విధివిధానాలను రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇవ్వడం శుభ పరిణామం. విధివిధానాల్లో సరైన క్యాడర్ స్ట్రెంత్ నిర్ణయించాలి.
– పీ మధుసూదన్ రెడ్డి, అధ్యక్షుడు, తెలంగాణ పంచాయతీ కార్యదర్శి అసోసియేషన్
కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం..
జేపీఎస్లను రెగ్యులరైజ్ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినందుకు ఆయన జీవితాంతం రుణపడి ఉంటాం. నాలుగేండ్ల నుంచి గ్రామ పంచాయతీల రూపురేఖలు మార్చడంలో సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేశాం. పంచాయతీలకు అనేక అవార్డు రావడంలో మా కృషి కూడా ఉన్నందుకు గర్వంగా ఉంది.
– రామకృష్ణ, జూనియర్ పంచాయతీ కార్యదర్శి, కామారెడ్డి జిల్లా