Errabelli Dayakar Rao | అధికార అహంతో కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షాల కార్యకర్తలపై దాడులకు తెగబడటం సిగ్గు చేటని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపల్లి గ్రామానికి చెందిన రైతు, బీఆర్ఎస్ కార్యకర్త ఎండీ అక్బర్పై కాంగ్రెస్ నాయకుల దాడిని ఆయన ఖండించారు. తొర్రూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్యకర్త అక్బర్ను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కార్యకర్త అక్బర్పై కాంగ్రెస్ నాయకుల దాడి బాధాకరమని అన్నారు. చెరువు కుంట నుంచి మొరం మట్టిని తన వ్యవసాయ భూమిలో పోసుకుంటే.. మట్టి కావాలంటే కాంగ్రెస్లో చేరాలని ఆ పార్టీ నాయకులు సోమిరెడ్డి, వెంకటేశ్వర్లు భౌతిక దాడులకు దిగడం విచారకరమని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఎక్కడ కూడా ఇలాంటి దాడులు, దౌర్జన్యాలకు పాల్పడలేదని అన్నారు. అధికార అహంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎస్పీ, డీఎస్పీలు స్పందించి విచారణ చేపట్టి దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోలీస్స్టేషన్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు.