TS Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు ఎర్రబెల్లి దయాకర్రావు ఓటమి పాలయ్యారు. ఇద్దరు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసిన ఇద్దరు ఓడిపోయారు. ఎర్రబెల్లి దయాకర్రావు బీఆర్ఎస్ నుంచి పాలకుర్తి ఎమ్మెల్యేగా మరోసారి బరిలోకి దిగారు. ఆయన సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్కుమార్ రావు వరంగల్ ఈస్ట్ నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగారు. అయితే, ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎల్లారెడ్డి నుంచి బరిలోకి దిగిన దయాకర్రావు అల్లుడు మధన్ మోహన్రావు మాత్రం విజయం సాధించారు. పాలకుర్తి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఎర్రబెల్లి దయాకర్రావు అనూహ్యం కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి చేతిలో ఓటమి చెందారు. ఆయన సోదరుడు ప్రదీప్రావు కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ చేతిలో ఓడిపోయారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావు డీలర్గా తన జీవితాన్ని ప్రారంభించారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి.. అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. మాస్ లీడర్గా ఇప్పటివరకు అపజయం లేకుండా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా పని చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి 1994లో ఎర్రబెల్లి దయాకర్ రావు పోటీ చేసి సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి ఎర్రబెల్లి వరదరాయేశ్వరరావుపై గెలుపొందారు. 1999, 2004 ఎన్నికల్లో సైతం ఎర్రబెల్లి దయాకర్ రావు టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించి వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ నమోదు చేశారు. ఈ నియోజకవర్గం నుంచి వరుసగా హ్యాట్రిక్ సాధించిన ఏకైక ఎమ్మెల్యే దయాకర్ రావు నిలిచారు.
2009 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా వర్ధన్నపేట నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్ కావడంతో దయాకర్ రావు జనరల్ స్థానమైన పాలకుర్తికి మారారు. పాలకుర్తి నియోజకవర్గంలో సైతం 2009లో టీడీపీ అభ్యర్థిగా ఎర్రబెల్లి దయాకర్ రావు గెలుపొందారు. 2014 ఎన్నికల్లో సైతం టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆయన తెలుగుదేశం నుంచి అప్పటి టీఆర్ఎస్లో (ఇప్పుడు బీఆర్ఎస్) చేరారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. పాలకుర్తి నియోజకవర్గంలోనూ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసిన ఆయన.. నాలుగోసారి ఓటమి చెందారు. 2008 ఉప ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 1994 నుంచి 2023 వరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా విజయం సాధిస్తూ ఎన్నికల్లో ఓటమెరుగని నేతగా కొనసాగుతూ వచ్చిన దయాకర్రావు తాజాగా జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా ఓటమిపాలయ్యారు.
ఓ వైపు ఎర్రబెల్లి దయాకర్రావు రాజకీయాల్లో ఓటమెరుగని నేతగా రాజకీయాల్లో కొనసాగుతూ వచ్చారు. ఆయన సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్రావుకు మాత్రం రాజకీయాలు కలిసిరావడం లేదు. అన్నను ఆదర్శంగా తీసుకొని రాజకీయరంగ ప్రవేశం చేసిన ప్రదీప్రావు ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా గెలుపొందలేదు. మొదట వ్యాపారం రంగంలో రాణించిన ఆయన తొలుత వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా పని చేశారు. అయితే, ఆయన ఏ పార్టీలో నిలకడగా ఉండలేరనే విమర్శలున్నాయి. 2008లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశారు. అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి బసవరాజు సారయ్య చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2013లో తెలంగాణ నిర్మాణ సమితి పార్టీలో చేరిన ఆయన.. ఆ తర్వాత కొద్దిరోజులకే టీఆర్ఎస్లో చేరారు. 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, కీలక పదవి ఇస్తామని అధిష్ఠానం హామీ ఇవ్వడంతో ఆయన వెనక్కి తగ్గారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి వరంగల్ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ చేతిలో ఓడిపోయారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఎర్రబెల్లి దయాకర్రావుకు మదన్ మోహన్ రావుకు స్వయాన అల్లుడు. గతంలో ఆయన మామతో కలిసి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా కలిసి పని చేశారు. ఆ తర్వాత ఎర్రబెల్లితో కలిసి ఆయన టీడీపీని వీడి టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఆరువేల ఓట్ల తేడాతో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థి బీబీ పాటిల్ చేతిలో ఓటమిపాలయ్యారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మదన్ మోహన్రావు ఎల్లారెడ్డి నుంచి టికెట్ ఆశించారు. అయితే, బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన ఏనుగు రవీందర్రెడ్డితో టికెట్ విషయంలో పోటీపడ్డారు. చివరకు టికెట్ను దక్కించుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి జాజాల సురేందర్పై 24వేలకుపైగా ఓట్ల మెజారిటీతో మదన్ మోహన్ గెలుపొందారు.