దేశాన్ని పచ్చగా మార్చేందుకు ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంపై ప్రపంచ పర్యావరణవేత్త ఎరిక్ సోల్హెమ్ ప్రశంసలు కురిపించారు. ఇది పుడమితల్లిని చల్లగా మార్చే అద్భుత కార్యక్రమమని అభివర్ణించారు. రాజస్థాన్లోని జైపూర్లో శ్రీకల్పతరు సంస్థాన్ ఆధ్వర్యంలో వృక్ష మిత్ర సమ్మాన్ సమరోహ్ కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొన్నారు.
గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా ఎరిక్ సోల్హెమ్.. రాజస్థాన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మొక్కలు నాటారు. జైపూర్లో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎరిక్ సోల్హెమ్ను గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధులు ఆకుపచ్చ కండువాతో సత్కరించారు. ఆయనకు వృక్షవేదం పుస్తకాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా ఎరిక్ సోల్హెమ్ మాట్లాడారు. మొక్కలు నాటేందుకు తెలంగాణ, రాజస్థాన్ కలిసి పనిచేయడం సంతోషకరమన్నారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు ఎంపీ సంతోష్కుమార్ను అభినందించారు.