Yadagirigutta Brahmotsavam | యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 15: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 2026 వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుంచి 28 వరకు వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో భవానీశంకర్ తెలిపారు. ఆదివారం ఆయన తన కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 18న స్వస్తీవాచనం, అంకురార్పణ, విశ్వక్సేరాధన, రక్షాబంధనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. 24న ఎదుర్కోళ్లు, 25న స్వామివారి తిరుకల్యాణోత్సవం, 26న దివ్య విమాన రథోత్సవం, 27న మహాపూర్ణాహుతి, చక్రతీర్థం, 28న శతఘటాభిషేకంతో ఉత్సవాలకు పరిసమాప్తి పలుకుతామని పేర్కొన్నారు.
ఆరు రోజులపాటు అలంకార సేవలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.2 కోట్లు కేటాయించినట్టు అన్నారు. ఈ ఉత్సవాల్లో 100 మంది పారాయణీకులు, రుత్వికులు, ఆచార్యులు, పండితులు పాల్గొననున్నట్టు పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణమంతా విద్యుద్దీపకాంతులతో మిరిమిట్లు గొలిపే అలంకరించనున్నట్టు తెలిపారు. బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 18 నుంచి 28వరకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, మొక్కు సేవలను రద్దు చేస్తున్నట్టు ఈవో ప్రకటించారు.