సూర్యాపేట : పర్యావరణ సమస్య ప్రపంచానికి పెను సవాల్గా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. కాలుష్యం విజృంభించడంతో మొత్తానికి మొత్తం భూమండలమే ప్రమాదంలో పడిందని గణాంకాలు చెబుతున్నామన్నారు. ఆదివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో స్థానిక గ్రీన్ క్లబ్ నిర్వాహకులు నరేందర్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీని ప్రారంభించి, పురవీధుల్లో సైకిల్పై పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాలుష్యం మానవాళిని బెంబేలెత్తిస్తోందని, అత్యాశ, తెలియని తనం వెరసి మానవ తప్పిదంతో ఇంతటి దుస్థితికి చేరిందన్నారు.
అడవుల నరికి వేత అందుకు ప్రధాన కారణమన్నారు. పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్లో ఆక్సిజన్ దొరకని పరిస్థితులు ఉత్పన్నమవుతాయని హెచ్చరించారు. వాస్తావానికి 33శాతం ఉండాల్సిన అడవులు 26శాతానికి పడిపోవడం.. సూర్యాపేట జిల్లాలో కేవలం మూడున్నర శాతానికి పడిపోవడంతో ఇలాంటి దుష్పరిణామాలు సంభవిస్తున్నాయాన్నారు. 40 ఏండ్ల కిందట సూర్యాపేటలో అసలు ఫ్యాన్లనేవి ఉపయోగించే వారు కాదని ఇప్పుడు.. డబుల్ ఏసీ లేకుంటే ఉండలేని పరిస్థితులు లేవన్నారు. వీటన్నింటినీ గమనించిన మీదటనే సీఎం కేసీఆర్ 220 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారని మంత్రి తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన హరితహారం రాష్ట్రంలో ఒక ఉద్యమంలా కొనసాగుతుందన్నారు.
అలాంటి ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యేందుకు గ్రీన్ క్లబ్ తరచుగా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనియమన్నారు. ప్రజల్లో పర్యావరణంపై అవగాహన కల్పించడంతో పాటు మొక్కలు నాటడం, నాటిన మొక్కలను సమరక్షించడంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆదివారం జరగాల్సిన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రీన్ క్లబ్ నిర్వాహకులు నరేందర్ ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం సూర్యాపేటలో సైకిల్ ర్యాలీ నిర్వహించారని మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, కమిషనర్ సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.