Southwest Monsoon | హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ బంగాళాఖాతంలోకి చేరాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నికోబార్ ఐలాండ్స్, దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని భాగాల వరకు రుతుపవనాలు విస్తరించాయని తెలిపింది. తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వచ్చే మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్టు ప్రకటించింది.
ద్రోణి శుక్రవారం తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా కర్ణాటక వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నదని తెలిపింది. దిగువ స్థాయి గాలులు వాయవ్య దిశ నుంచి తెలంగాణలోకి వీస్తున్నాయని పేర్కొన్నది. హైదరాబాద్ చుట్టు పక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 39 నుంచి 41 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.