Minister KTR | హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): సుడిగాలి పర్యటనల్లో ఉన్నప్పుడు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తున్న సమయంలో తదుపరి కార్యక్రమం గురించి ప్రిపేర్ కావడానికి కొద్ది సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఒక విద్యార్థి పరీక్షకు సిద్ధమవుతున్నట్టు తాము ప్రిపేర్ కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రామగుండం, మంచిర్యాల పర్యటనలో భాగంగా హెలికాఫ్టర్లో పలు అంశాలకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్న సందర్భంలోని ఫొటోను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆయనను అభినందిస్తూ, ఆయనను స్పూర్తిగా తీసుకోవాలని నెటిజన్లు ట్వీట్ షేర్ చేశారు.
పారిశ్రామికవేత్తలు పెరగాలి
ఇంకా ఎక్కువ సంఖ్యలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తయారు కావాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న టీ వర్క్స్ను మంత్రి అభినందించారు. గ్రేట్ జాబ్ టీ వర్క్స్ బృందం అంటూ ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో ‘మనిషి అంత్యక్రియలు గౌరవప్రదంగా జరిగే విధంగా రాష్ట్రంలోని ప్రతి పట్టణంలో వైకుంఠధామాన్ని అన్ని వసతులతో నిర్మిస్తామని’ తెలిపారు. బేగంపేటలో నిర్మించిన మహాపర్ణి నిర్వాణను ప్రారంభించినట్టు ట్వీట్లో పేర్కొన్నారు.