న్యూఢిల్లీ, ఆగస్టు 23: అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే తదుపరి సీజన్లో చక్కెర ఎగుమతులను నిషేధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ ఏడాది దేశంలో చెరుకు దిగుబడులు తగ్గుతాయన్న అంచనాలే ఇందుకు కారణమని, విదేశాలకు చక్కెర ఎగుమతులను నిలిపివేయనుండటం ఏడేండ్లలో ఇదే తొలిసారని అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో న్యూయార్క్, లండన్ లాంటి నగరాల్లో ఇప్పటికే గరిష్ఠ స్థాయికి చేరిన బెంచ్మార్క్ ధరలు మున్ముందు మరింత పెరిగి, ఆహార ద్రవ్యోల్బణం అధికం కావచ్చన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
దేశీయ అవసరాలను తీర్చడం, మిగిలిన చెరుకు నుంచి ఇథనాల్ను ఉత్పత్తి చేయడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉన్నందున వచ్చే సీజన్లో ఎగుమతులకు కేటాయించగలిగినంత చక్కెర ఉండదని ఓ అధికారి స్పష్టం చేశారు. గత సీజన్లో 11.1 మిలియన్ టన్నుల చక్కెర ఎగుమతులు జరిపేందుకు మిల్లులను అనుమతించిన కేంద్ర ప్రభుత్వం.. సెప్టెంబర్ వరకు కొనసాగే ప్రస్తుత సీజన్లో కేవలం 6.1 మిలియన్ టన్నుల చక్కెర ఎగుమతులకు మాత్రమే అనుమతించింది. విదేశాలకు చక్కెర అమ్మకాలను తగ్గించేందుకు భారత్ 2016లో ఎగుమతులపై 20 శాతం పన్ను విధించింది. ఆ తర్వాత చక్కెర ఎగుమతులను నిలిపివేయనుండటం ఇదే తొలిసారి.