రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన చదువు -ఆనందించు- అభివృద్ధిచెందు ప్రోగ్రాం
హైదరాబాద్, ఫిబ్రవరి 5 : విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు పాఠశాల విద్యాశాఖ చేపట్టిన 100 రోజుల రీడింగ్ క్యాంపెయిన్ శనివారం ప్రారంభమైంది. ‘చదువు -ఆనందించు- అభివృద్ధిచెందు’ పేరుతో వసంత పంచమి పర్వదినాన తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో నిర్వహించారు. తొలిరోజు టీచర్లంతా పిల్లలతో పుస్తకాలను చదివించారు. ఇంతకాలం గ్రంథాలయాలు, బీరువాల్లో దాచిన పుస్తకాలు.. విద్యార్థుల చేతుల్లోకి వచ్చాయి. కార్యక్రమంలో భాగంగా తొలిరోజు విద్యార్థులతో 15 నిమిషాలపాటు పుస్తకాలను టీచర్లు చదివించారు. కరోనా పరిస్థితుల కారణంగా విద్యార్థుల పడిపోయిన పఠనా సామర్థ్యాలను తిరిగి పెంచేలా కృషిచేస్తున్నారు. శంషాబాద్లోని ఎయిర్పోర్ట్ స్కూలుకు రీడింగ్ క్యాంపెయిన్ స్టేట్ కో ఆర్డినేటర్ సువర్ణ వినాయక్, తదితరులు 1,600 పుస్తకాలను అందజేశారు. నాగర్కర్నూల్ జిల్లాలోని సోమశిల ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు కొందరు 300 పుస్తకాలను అందజేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని నిపణి ప్రాథమికోన్నత పాఠశాల గ్రంథాలయానికి ఆర్మీ జవాన్ సుదర్శన్ 100 పుస్తకాలను విరాళంగా ఇచ్చారు.