హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆంగ్ల మాధ్యమ చదువులు అత్యవసరమని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల జీవితాలు ఇంగ్లిష్ మీడియం చదువులతోనే బాగుపడతాయని పేర్కొన్నారు. ఇంగ్లిష్ మీడియంలో చదవలేకనే గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులు వెనుకబడిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించడం చారిత్రక నిర్ణయమని కొనియాడా రు. శనివారం శ్రీకృష్ణ ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. ‘నాకు ముగ్గురు ఆడపిల్లలు. నా భార్య, నేను ప్రైవేటు ఉద్యోగాలు చేసుకొంటూ కుటుంబాన్ని పోషించుకొంటున్నాం. ప్రైవేటు స్కూళ్లల్లో ఫీజులు కట్టలేక ముగ్గురిని ప్రభుత్వ స్కూళ్లకే పంపిస్తున్నం. మూసాపేట ప్రభుత్వ స్కూల్లో చదువుకొంటూ నా బిడ్డలు ఇంగ్లిష్లో మాట్లాడుతుంటే ముచ్చటేస్తున్న ది. కార్పొరేటు స్కూళ్లల్లోని పిల్ల ల మాదిరిగానే మా పిల్లలు మాట్లాడుతుంటే గర్వంగా అనిపిస్తున్నది. ఇంగ్లిష్ మీడియం ఉండబట్టే మా పిల్లలను సర్కారు బడికి పంపిస్తున్నాం. అదే ప్రైవేటు స్కూళ్లకు పంపిస్తే ముగ్గురికి ఏటా రూ.2 లక్షలు ఖర్చుచేయా ల్సి వచ్చేది. నాలాంటి పరిస్థితే అందరు తల్లిదండ్రులు ఎదుర్కొంటున్నారు. సర్కారు స్కూళ్లల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడితే అందరు నాలాగే ప్రభుత్వ బడులకే పంపిస్తరు. ఫీజుల బాధల నుంచి ఉపశమనం పొందుతారు’ అని తెలిపారు. ఇంగ్లిష్లో పట్టు ఉన్నవారే పైచదువులు, విదేశీ చదువులను అందిపుచ్చుకొంటున్నారని, చిన్నప్పటి నుంచే ఇంగ్లిష్లో చదవడం, రాయడం అలవాటు చేయడం అత్యవసరమని పేర్కొన్నారు. ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించడం ద్వారా పిల్లల్లో భయాన్ని పోగొట్టగలుగుతామన్నారు.
ఇప్పుడున్న టీచర్లకు ఆ శక్తి ఉన్నది
ఇంగ్లిష్ మీడియంలో బోధించేందుకు టీచర్లు లేరనడం అవగాహనరాహిత్యమని శ్రీకృష్ణ అన్నారు. టెట్, డీఎస్సీల్లో సాధించిన ఇంగ్లిష్ పరిజ్ఞానం పాఠ్యాంశాల బోధనకు సరిపోతుందని, ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లు ఉత్తమంగా బోధించగలరని అభిప్రాయపడ్డారు. ఎంఈడీ పూర్తిచేసిన వ్యక్తిగా తాను ఈ విషయాన్ని ఘంటాపథంగా చెప్పగలనన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో బోధించే అవగాహన టీచర్లందరికీ ఉంటుందని, పిల్లలు సైతం ఇట్లే అల్లుకుపోగలరన్న ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణ వచ్చాక గురుకులాల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించినప్పుడు వాటిల్లో చేరిన విద్యార్థులంతా తెలుగు మీడియం వారేనని, వారిప్పుడు ఇంగ్లిష్లో చదువుకొని విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసిస్తున్నారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని, ఇది బడుగుల దిశను మారుస్తుందని పేర్కొన్నారు. మన ఊరు-మన బడి పథకం ద్వారా స్కూళ్ల అభివృద్ధికి రూ.7,289 కోట్లు ఖర్చుచేయడం అత్యంత సాహసోపేత నిర్ణయమని కొనియాడారు.