ఇంగ్లిష్ అంతర్జాతీయ భాష.. చిన్న ఉద్యోగాలకూ అవసరమే
సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం సానుకూల నిర్ణయం
ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్
ప్రొఫెసర్ బీఎస్ మూర్తి వెల్లడి
హైదరాబాద్, ఫిబ్రవరి 5 : ఇంగ్లిష్ అంతర్జాతీయ భాష అని, ప్రస్తుత పోటీ ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలోని సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టటం సానుకూలాంశమని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి అభిప్రాయపడ్డారు. ఏ దేశానికి వెళ్లినా మనం మాట్లాడాల్సింది ఇంగ్లిష్లోనేనని, చిన్నప్పటి నుంచే పిల్లలకు ఆ బాష బోధించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. ఇంగ్లిష్ మాధ్యమ చదువులతో పిల్లలు పైకొస్తారని, అంతిమంగా ఇది మనకే లాభిస్తుందని తెలిపారు. సోమవారం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడిన ఆయన ప్రపంచమే మారుతున్నప్పుడు మనం మారడంలో తప్పు లేదని అన్నారు.
రూలేం లేదు కదా
మొదటి నుంచి ప్రభుత్వ పాఠశాలలంటే తెలుగు మీడియం, ప్రైవేట్ స్కూళ్లంటే ఇంగ్లిష్ మీడియం అన్న భావన ఉన్నది. ఈ పరిస్థితి పూర్తిగా మారాలి. సర్కారు బడుల్లో ప్రాథమిక దశ నుంచే ఇంగ్లిష్ మీడియం బోధన చేపట్టాలి. సర్కారు స్కూళ్లల్లో ఇంగ్లిష్ మీడియం ఉండొద్దన్న రూలేం లేదు కదా. వాటిల్లోను ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం మంచి నిర్ణయం.
మమకారం పోకూడదు
ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవడం అంటే మన మాతృభాష మీద మమకారాన్ని వదులుకోరాదు. మాతృభాషను పరిరక్షించుకోవాల్సిందే. దీంట్లో రెండో ఆలోచన ఉండకూడదు. నేను 10వ తరగతి వరకు తెలుగు మీడియంలోనే చదువుకున్నా. ఇంజినీరింగ్ చదివేటప్పుడు ఇంగ్లిష్ మీడియం కావడంతో కాస్త కష్టమనిపించింది. అయినా పట్టువదలకుండా కష్టపడి నేర్చుకున్నా. తెలుగు, ఇంగ్లిష్ను సమాంతరంగా నేర్పించాలి. విద్యాప్రమాణాలను మెరుగుపరచాలి.
చైనావాళ్లే మారుతున్నారు
మాతృభాషకు అధిక ప్రాధాన్యం ఇచ్చే చైనాలో సైతం ఇంగ్లిష్ మీడియం వైపు మొగ్గు చూపుతున్నారు. ఆంగ్లమాధ్యమంలో బోధిస్తున్నారు. వారికి, మనకు ఉన్న తేడాలేంటంటే వారికి ఒక్కటే మాతృభాష. మన దగ్గర మాతృభాష కాకుండా హిందీతోపాటు ఇంగ్లిష్ను నేర్చుకోవాల్సి ఉంటుంది. అయినా మన పిల్లలు సులభంగానే నేర్చుకొంటున్నారు.
చిన్న ఉద్యోగానికీ ఆంగ్లం
ఏ చిన్న ఉద్యోగమైనా ఓ మోస్తరు ఇంగ్లిష్ వచ్చినవారినే రిక్రూట్ చేసుకొంటున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మనవాళ్లు కమ్యూనికేషన్ స్కిల్స్ లేక ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు మీడియంలో ప్రాథమిక విద్యను అభ్యసించి ఉన్నత విద్య కోసం అత్యున్నత విద్యాసంస్థల్లో చేరిన విద్యార్థులు మిగతా విద్యార్థులతో సమానంగా పోటీ పడలేకపోతున్నారు. ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. దీనికి ఎక్కడో ఒక దగ్గర పుల్స్టాప్ పెట్టాల్సిందే.