న్యూఢిల్లీ, ఆగస్టు 9: విద్యుత్తు రంగం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బుధవారం ఉద్యోగులు కదం తొక్కారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘విద్యుత్తు ప్రైవేటీకరణ వ్యతిరేక దినోత్సవం’లో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఆందోళనలో విద్యుత్తు రంగంలోని చిన్నస్థాయి ఉద్యోగి నుంచి ఇంజినీరు స్థాయి ఉద్యోగి వరకు ప్రతి ఒక్కరూ పాలుపంచుకున్నారు. హైదరాబాద్, విజయవాడ, గువాహటి, లక్నో, హిసార్, పంచకుల, పాటియాలా, చెన్నై, త్రివేండ్రం, బెంగళూరు, డెహ్రాడూన్, సిమ్లా, జమ్ము, శ్రీనగర్ ఇలా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి నగరంలో భారీస్థాయిలో ఆందోళన జరిగింది.
‘సేవ్ పవర్ సెక్టార్.. సేవ్ ఇండియా’ అనే నినాదాలతో ప్రతి ప్రాంతం మార్మోగింది. విద్యుత్తు రంగాన్ని ప్రైవేటుకు అప్పగించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని, ఇందులో భాగంగానే విద్యుత్తు సవరణ బిల్లు-2022ను తీసుకొస్తున్నదని ఉద్యోగుల సంఘం చైర్మన్ శైలేంద్ర దూబే విమర్శించారు. ఒకవేళ విద్యుత్తు ప్రైవేటీకరణ జరిగితే ముఖ్యంగా రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉచిత విద్యుత్తు, సబ్సిడీలు తదితర సామాన్యులకు, రైతులకు ఉపయోగపడే పథకాలు రద్దు అయ్యే అవకాశముంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్తు సవరణ బిల్లుతో పాటు ప్రైవేటీకరణ ప్రయత్నాలన్నింటినీ వెంటనే కేంద్రం ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే తమ ఉద్యమం దశలవారీగా కొనసాగుతుందని, గురువారం నుంచి సమ్మె చేసేందుకు వెనుకాడమని శైలేంద్ర దూబే హెచ్చరించారు.