నిజామాబాద్ క్రైం, అక్టోబర్ 19 : తాను తిరుగుతున్న కారు అద్దె బిల్లు మంజూరు చేసేందుకు డీపీఆర్వోలో పని చేస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ లంచం(Bribe) డిమాండ్ చేసి చివరికి ఏసీబీ అధికారులకు పట్టుబడింది. బాధితుడు, అవినీతి నిరోధక శాఖ డీజీ(డైరెక్టర్ జనరల్) తెలిపిన మేరకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగరానికి చెందిన కోనేటి విజయ్ కుమార్ అనే వ్యక్తి తన కారును డీపీఆర్వో కార్యాలయంలో డిప్యూటి ఎగ్జిక్యూటీవ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్గా విధులు నిర్వర్తిస్తున్న సి.వేణి ప్రసన్న అనే అధికారిణి వద్ద అద్దెకు పెట్టాడు.
ఆమె తన డ్యూటీలో భాగంగా నిత్యం కారును వాడుకునేది. అందుకు గాను ప్రతి నెలా రూ.33 వేల అద్దె అగ్రిమెంట్ చేసుకున్నారు. కారుకు మూడు నెలల నుంచి బిల్లులు రాలేదు. తనకు ఆఫీస్ నుంచి రావాల్సి రూ.99 వేల బిల్లు మంజూరు అయ్యేలా చూడాలని విజయ్ కుమార్.. వేణి ప్రసన్నను కోరాడు. దీంతో మూడు నెలల బిల్లులకు గాను నెలకు రూ.3 చొప్పున రూ.9 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. తనకు న్యాయంగా రావాల్సిన డబ్బులకు లంచం ఇవ్వడం ఇష్టంలేని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
వారు ఇచ్చిన సలహా మేరకు గురువారం లంచం డబ్బులు అధికారికి ఇచ్చేందుకు డీపీఆర్వో ఆఫీస్కు వెళ్లాడు. అప్పటికే మెదక్ జిల్లా ఏసీబీ డీఎస్పీ, నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో రెండు జిల్లాల అధికారులు, సిబ్బంది కలెక్టరేట్ వద్ద నిఘా పెట్టారు. విజయ్ కుమార్ రూ.9వేలు లంచం డబ్బులను డీఈఐఈ వేణి ప్రసన్నకు ఇవ్వగానే దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం సదరు అధికారిపై కేసు నమోదు చేసి, కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు.