TSPSC | హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. ఈ వ్యవహారంలో హైదరాబాద్ పోలీసుల కేసు ఆధారంగా గతవారం ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ.. సోమవారం కస్టోడియన్ శంకరలక్ష్మి, అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణకు నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్రెడ్డి స్టేట్మెంట్ను రికార్డు చేసేందుకు అనుమతించాలంటూ నాంపల్లి కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. టీఎస్పీఎస్సీ వ్యవహారంలో ఇప్పటి వరకు 17 మందిని సిట్ అరెస్టు చేసింది. ఇంకా అధికమొత్తంలో డబ్బులు చేతులు మారి ఉంటాయోమోనని ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కస్టోడియన్గా ఉన్న శంకరలక్ష్మి, అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న సత్యనాయణకు ఈడీ నోటీసులు జారీ చేసింది.
విడివిడిగా విచారణ?
శంకరలక్ష్మి కంప్యూటర్ నుంచే ప్రశ్నపత్రాలు లీక్ కావడంతో, ఆమె పాత్రపై ఈడీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో మొదటిసారిగా బేగంబజార్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణపై కూడా ఈడీ దృష్టి పెట్టింది. బుధవారం, గురువారాల్లో శంకరలక్ష్మి, సత్యనారాయణను విడివిడిగా విచారించే అవకాశం ఉన్నది. సిట్ సేకరించిన వివరాలు, ఫోరెన్సిక్ నివేదికలు, ఈ కేసులో ఇతర విషయాలకు సంబంధించిన వివరాలను కూడా తమకు అప్పగించాలని ఈడీ లేఖ రాసినట్టు విశ్వసనీయ సమాచారం. గ్రూప్-1 పరీక్ష పత్రాన్ని ముందుగానే అందుకొని, విదేశాల నుంచి వచ్చి పరీక్ష రాయడం, లక్షల్లో డబ్బులు చేతులు మారాయనే అనుమానంతో ఈడీ ఈ కేసులోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రవీణ్, రాజశేఖర్రెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను కోర్టు గురువారం విచారించనున్నది. కోర్టు అనుమతి రాగానే చంచల్గూడ జైలులో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న ప్రవీణ్, రాజశేఖర్రెడ్డిలను ఈడీ విచారించనున్నది.