హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): వానకాలం ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ సర్కారు సత్తా చాటింది. ఈ సీజన్లో 64 లక్షల టన్నుల ధాన్యాన్ని కొన్నది. ఇందుకు రూ.13,072 కోట్లు చెల్లించింది. వానకాలం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. కొనుగోళ్ల కోసం ఏర్పాటు చేసిన 7016 కేంద్రాలను అధికారులు మూసివేశారు. ఈ సీజన్లో రైతులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు అధికారులు ధాన్యం కొన్నారు. మూడు, నాలుగు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు.
కొనుగోళ్లు పూర్తి..
నిరుడు వానకాలంలో 70.22 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనగా, ఈ సీజన్లో 64 లక్షల టన్నులు కొన్నది. అంతకు మునుపు 50 లక్షల టన్నుల మార్క్ దాటలేదు. 2014-15 వానకాలం సీజన్లో కేవలం 11.03 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. ఇందుకు ప్రభుత్వం రూ.1,536.85 కోట్లు మాత్రమే చెల్లింది. అలాంటిది ఇప్పుడు ఏకంగా రూ.13,072.44 కోట్ల విలువైన 64 లక్షల టన్నుల ధాన్యం కొనడం గమనార్హం. ఈ సారి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో ధాన్యం, బియ్యం కొరతతో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు రైతుల నుంచి నేరుగా భారీ మొత్తంలో ధాన్యం కొన్నారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోళ్లకు కాస్త తక్కువగా ధాన్యం వచ్చింది. లేని పక్షంలో గతేడాదిని మించి ధాన్యం కొనుగోలు చేసేది.
నిజామాబాద్ ఫస్ట్.. ఆదిలాబాద్ లాస్ట్
ఈ వానకాలం ధాన్యం కొనుగోళ్లలో నిజామాబాద్ జిల్లా టాప్లో నిలిచింది. 5.85 లక్షల టన్నులతో నిజామాబాద్ మొదటి స్థానంలో నిలువగా, 2302 టన్నులతో ఆదిలాబాద్ చివరి సానంలో నిలిచింది. 4.74 లక్షల టన్నులతో కామారెడ్డి జిల్లా రెండో స్థానంలో, 4.12 లక్షల టన్నులతో నల్లగొండ మూడో స్థానంలో, 3.94 లక్షల టన్నులతో నాలుగో స్థానంలో మెదక్, 3.78 లక్షల టన్నులతో జగిత్యాల ఐదో స్థానంలో నిలిచాయి.
సీఎం కేసీఆర్ పథకాల పుణ్యమే..
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాల పుణ్యమా అని తెలంగాణ అన్నపూర్ణగా ఎదిగింది. 64 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లతో సత్తా చాటింది. వానకాలం సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజా కొన్నాం. ఈ ఒక్క సీజన్లోనే ధాన్యం కొనుగోళ్ల ద్వారా రైతుల ఖాతాల్లో రూ. 13 వేల కోట్లు జమ చేశాం.
– గంగుల కమలాకర్, పౌరసరఫరాల శాఖ మంత్రి