హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): సమాజంలో అన్నివర్గాలకు సమాన అవకాశాలు కల్పించినప్పుడే సాధికారత సాధ్యమవుతుందని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. చట్ట సభల్లో బీసీలు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ తొలి శాసనసభ సమావేశాల్లోనే సీఎం కేసీఆర్ తీర్మానం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లులను ఆమోదించాలంటూ ప్రధానికి లేఖ రాసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
శనివారం తెలంగాణభవన్లో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో పశువులు, జంతువులకు లెక్కలుంటాయి కానీ బీసీలకు ఉండవా? అని ప్రశ్నించారు. ఈ సమావేశాల్లో బీసీ, మహిళా బిల్లుల ఆమోదం కోసం కేంద్రాన్ని నిలదీస్తామని పేర్కొన్నారు. దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. సబ్బండ వర్గాలకు న్యాయం చేసేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
మహిళలు, వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారంలో చట్టబద్ధ హక్కు కల్పించాలన్న ఉద్దేశంతోనే ఆ వర్గాలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేసినట్టు పేర్కొన్నారు. అధికారంలో, చట్టసభల్లో బీసీలు లేకపోవడం వల్లే కేంద్రంలోని వివిధ శాఖల్లో 60 శాతం ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని వివరించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి: కిషోర్ గౌడ్
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి బీజేపీ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు కే కిశోర్గౌడ్ కోరారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రిజర్వేషన్ల ద్వారా మాత్రమే బీసీలు చట్టసభల్లో అడుగుపెట్టడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. తాను బీసీనని చెప్పుకునే ప్రధాని మోదీ ఈ 9 ఏండ్లలో బీసీ సంక్షేమానికి చేసిందేమీ లేదని విమర్శించారు.
బీసీలు, మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని సీఎం కేసీఆర్ తీర్మానం చేసి కేంద్రానికి పంపి ఏండ్లు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓబీసీ, మహిళా బిల్లులు ఆమోదించాలని కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ రాయడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో బీసీ, మహిళా బిల్లులు ప్రవేశపెట్టకుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.