హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. గత వారం రోజుల్లోనే ఏకంగా రూ.2,950 కోట్ల పెట్టుబడులు సాధించింది. లైఫ్ సైన్సెస్తోపాటు ఆభరణాలు, వంట నూనెల తయారీ తదితర రంగాలకు ఈ పెట్టుబడులు వచ్చాయి. తద్వారా మొత్తంగా దాదాపు 6 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వీటిలో రూ.1,100 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 5 ప్రాజెక్టులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం జీనోమ్ వ్యాలీలో ప్రారంభించారు. వీటికి అదనంగా వచ్చే వారం మరికొన్ని పెట్టుబడులు రానున్నాయి. ప్రముఖ ఫార్మా కంపెనీ హెటిరో కొత్తగా రూ.600 కోట్లు, పశువుల వ్యాక్సిన్ల తయారీ కోసం ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ (ఐఐఎల్) సంస్థ రూ.700 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించాయి. తద్వారా 2,750 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
ఎల్లో రివల్యూషన్ దిశగా అడుగులు
రాష్ట్ర ప్రభుత్వం విస్తృత స్థాయిలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తుండటంతో ఎల్లో రివల్యూషన్ దిశగా తెలంగాణ అడుగులు వేస్తున్నది. దీనిలో భాగంగా జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ కంపెనీ వంట నూనెల తయారీ యూనిట్ను నెలకొల్పనున్నది. రోజుకు 1,000 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న ఈ యూనిట్ ద్వారా వెయ్యి మందికిపైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
గత వారం రోజుల్లో వచ్చిన పెట్టుబడులు
అక్టోబర్ 10: పశువుల వ్యాక్సిన్ తయారీ కోసం ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ సంస్థ రూ.700 కోట్ల పెట్టుబడి పెట్టింది. ప్రస్తుతం 300 మిలియన్ డోసుల సామర్థ్యంతో ఏర్పాటయ్యే ఈ యూనిట్ ద్వారా 750 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. భవిష్యత్తులో ఈ యూనిట్ సామర్థ్యాన్ని రెట్టింపు చేయనున్నారు.
అక్టోబర్ 12: వంట నూనెల రిఫైనరీ ఏర్పాటు కోసం జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ కంపెనీ రూ.400 కోట్ల పెట్టుబడి పెట్టింది. దీని ద్వారా 1,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
అక్టోబర్ 15: దేశంలోనే అతిపెద్ద ఆభరణాల తయారీ యూనిట్ స్థాపన కోసం మలబార్ గ్రూపు రూ.750 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఏటా 10 టన్నుల బంగారు ఆభరణాలు, 1.5 లక్షల క్యారెట్ల వజ్రాభరణాలను తయారు చేయగలిగే ఈ యూనిట్ ద్వారా 2,750 మందికి ఉపాధి లభిస్తుంది.
అక్టోబర్ 18: ఆర్ఎక్స్ ప్రొపెల్లెంట్, జీవీఆర్పీ ప్రీ క్లినికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (సీఆర్వో), మరో మూడు కంపెనీలకు చెందిన ఐదు ప్రాజెక్టులను మంత్రి కేటీఆర్ మంగళవారం జీనోమ్ వ్యాలీలో ప్రారంభించారు. రూ.1,100 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటవుతున్న ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 1,500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.