వరంగల్ : తెలంగాణలోనే ఉపాధి, ఉద్యోగావకాశాలు ఎక్కువ . సీఎం కేసీఆర్, కేటీఆర్ల కృషితోనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. డీఆర్డీఏ హనుమకొండ వారి ఆధ్వర్యంలో ఎంప్లాయ్ మెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ (ఇ.జి.యం.యం.) ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లా నిరుద్యోగుల కోసం నిర్వహించిన మెగా జాబ్ మేళాను హన్మకొండ పబ్లిక్ గార్డెన్స్లో మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంతాలలోని నిరుద్యోగ యువతీ యువకులకు స్థిరమైన జీవనోపాధి కల్పించడానికి ప్రభుత్వం ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన పథకంలో భాగాంగా ఎంప్లాయ్ మెంట్ జనరేషన్ అండః మార్కెటింగ్ మిషన్ (ఇ.జి.యం.యం.) సంస్థను ఏర్పాటు చేసి, ఈ మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నదని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాలలోని స్వయం సహాయక సభ్యుల కుటుంబాలలోని నిరుద్యోగ యువతకు ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం’ కల్పించడం తద్వారా ప్రతి పేద కుటుంబం మంచి ఆదాయం పొందేలా చేయడం దీని లక్ష్యమన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వివిధ రంగాలలో ఎన్నో రకాల ఉపాధి అవకాశాలు విస్తృతంగా పెరుగుతున్నాయి.
అయితే ఈ ఉపాధి అవకాశాలను గ్రామీణ నిరుద్యోగ యువత అందుకోవడానికి కావాల్సిన నైపుణ్యాన్ని శిక్షణల ద్వారా అందించడమే ఆశయంగా ఈ సంస్థ పని చేస్తున్నదని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యా, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రాష్ట్రంలో విపరీతంగా పెరిగాయని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలోని ఉద్యోగాలే కాదు.
ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగుల కోసం మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం పట్ల ఆయా కంపెనీలను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్ రాజు, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు,డిఆర్ డిఓ శ్రీనివాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.