NREGA | సిద్దిపేట, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు మూడు నెలలుగా వేతనాలు రాక పస్తులు ఉంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వారికి వేతనాలే ఇవ్వలేదు. మార్చి నెల కూడా రానే వచ్చింది. ఇది కలుపుకొంటే నాలుగు నెలల జీతాలు పెండింగ్లో ఉంటాయి. రాష్ట్రంలో ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న వివిధ విభాగాలకు చెందిన 12,660 మందికి జీతాలు రావాల్సి ఉన్నది. దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం కొంత ఆలస్యమైనా ఏ నెల వేతనాలు ఆ నెల వేసింది. కానీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలలుగా వేతనాలు వేయకపోవడంతో ఇబ్బందిగా ఉన్నదని ఉద్యోగులు వాపోతున్నారు.
12,660 మందికి అందని వేతనాలు
రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న దాదాపు 12,660 మంది ఉద్యోగులకు జీతాలు రాక ఇబ్బంది పడుతున్నారు. ప్రతినెలా ఉద్యోగుల జీతాలు, ఇతర అవసరాలకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఏ నెలకు ఆ నెల సరిపడా బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్నది. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇవ్వకుండా పస్తులు ఉంచింది. 2023 డిసెంబర్లో 10,632 మందికి, ఇందులో టెక్నికల్ అసిస్టెంట్లు 2028 మందికి మొన్నటి శనివారం రోజున జీతాలు వేసింది. మిగిలిన 10,430 మంది జీతాలు పెండింగ్లోనే ఉన్నాయి. 2024 జనవరిలో 12,660 మంది, ఫిబ్రవరిలో 12,660 మందికి జీతాలు పెండింగ్లోనే ఉన్నాయి.
మార్చి నెల రానే వచ్చింది. ఈనెల కలిపితే నాలుగు నెలల జీతాలు పెండింగ్లోనే ఉన్నట్టు. రాష్ట్రంలో 3,974 మందిలో ఏపీవోలు 392 మంది, ఈసీలు 289, సీవో, ఏఏలు 870 మంది, టీఏలు 2028 మంది, అడిషనల్ డీఆర్పీలు 8 మంది, సీడీ సీఎల్ఆర్ 17 మంది, జేఈ(సివిల్) 60 మంది, ప్లాంటేషన్ సూపర్వైజర్స్ 26 మంది, పీవోలు 23 మంది, ఇతర విభాగాలకు చెందిన వారు 261 మంది ఉన్నా రు. మొత్తం అన్ని విభాగాలు కలిపి 12,660 మంది పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీరికి సకాలంలో వేతనాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నదన్న విమర్శలు ఉద్యోగుల నుంచి వినిపిస్తున్నాయి. వచ్చే వేతనాలు తెచ్చిన అప్పులకు వడ్డీలకే సరిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సకాలంలో జీతాలు ఇవ్వాలని ఉపాధిహామీ ఉద్యోగులు కోరుతున్నారు.