హైదరాబాద్, జనవరి 17 : రాష్ట్రంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలో కొనసాగుతున్న ఉపాధిహామీ పనులను ఈ నెలాఖరులోగా, మిగిలిన పనులను మార్చి నెలాఖరు కల్లా పూర్తిచేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. సోమవారం మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్తో కలిసి ఆయన ఉమ్మడి మహబూబ్గర్ జిల్లాలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో కొనసాగుతున్న పనులపై హైదరాబాద్లో సమీక్షించారు. పంచాయతీ భవనాల నిర్మాణం, కాలువల పూడికతీత వంటి పనులకు ఉపాధి హామీ నిధులను వినియోగించుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులు సూచించిన పనులతో పాటు, పెండింగ్ బిల్లుల క్లియరెన్స్పై నిర్లక్ష్యం చేయొద్దని ఆదేశించారు. కొత్త గిరిజన గ్రామ పంచాయతీలు, ఎస్సీ రిజర్వుడ్ పంచాయతీల భవనాల నిర్మాణాలకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను వినియోగించే అవకాశాలపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. డంపింగ్ యార్డుల్లోని చెత్త నుంచి తయారుచేసిన ఎరువుల అమ్మకాల ద్వారా రాష్ట్రంలోని పంచాయతీలకు రూ.300 కోట్ల ఆదాయం వచ్చినట్టు వివరించారు. మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధి నిధుల వినియోగంలో కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, మైనర్ కాలువల పూడికతీత పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. సీఎం ఆదేశాల మేరకు కోయిల్సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ను మంచినీటి అవసరాలకు కేటాయించాలని సూచించారు. సమావేశంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డితోపాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.