-2024 మార్చి 10న ఎంసీహెచ్ఆర్డీలో తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక సంఘాలతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టుగా తమ పరిస్థితి మారిందని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు వాపోతున్నాయి. వారితోపాటు కార్మికులు, పెన్షనర్లు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కొత్త హామీలు దేవుడెరుగు ఎన్నికల ముంగిట ఇచ్చిన హామీలనూ అమలు చేయడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల సంఘం అనుమతించినా గతంలో కేసీఆర్ విడుదల చేసిన డీఏను చెల్లించేందుకూ కాంగ్రెస్ సర్కారుకు చేతులు రావడం లేదని ఆవేదన చెందుతున్నారు. తమకు న్యాయంగా దక్కాల్సిన సౌకర్యాలను కల్పించకపోగా ‘మీరే చూస్తున్నారుగా..’ అని నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తున్నారని వాపోతున్నారు.
గత ప్రభుత్వ హయాంలో తామిచ్చిన వినతలు సంబంధిత శాఖలకు చేరేవని, ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహించేవారని, ఇప్పుడా పరిస్థిలే లేదని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం సీఎంకు, మంత్రులకు సమర్పించిన వినతిపత్రాలు ఎక్కడికి వెళ్తున్నాయో అర్థమే కావడం లేదని చెప్తున్నారు. అసలు మంత్రులు తామేం చెప్తున్నామో కూడా వినకుండానే ‘ఓకే.. చూద్దాం.. చేద్దాం’ అంటూ కాగితాలను పారేస్తున్నారని అంటున్నారు.
బదిలీల విషయంలో ప్రభుత్వానికి ఒక విధానమంటూ లేకుండాపోయిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇక విద్యాశాఖ విషయానికి వస్తే అప్పటికప్పుడు 317 జీవోపై మంత్రివర్గ ఉపసంఘాన్ని అయితే వేశారు కానీ, దానిపై ఏం చేయబోతున్నారో అన్నదానిపై సర్కారుకు ఇంకా స్పష్టత రాలేదని ఉపాధ్యాయ సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. మొత్తానికి రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరి ఆరు నెలలు కావస్తున్నా ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉన్న హామీల్లో తక్షణం పరిష్కరించగలిగిన వాటినైనా అమలు చేయడం లేదని ఉద్యోగ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పదవీ విరమణ చేసే ఉద్యోగులకు రావాల్సిన అన్నిరకాల సౌకర్యాలు చెల్లించే విషయంలో సర్కారుకు స్పష్టత లేదనే వాదన వినిపిస్తున్నది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అన్నిరకాల ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏండ్ల నుంచి 61 (2021 మార్చి 31 నుంచి 2024 మార్చి 30తో ఆ గడువు పూర్తి) ఏండ్లకు పొడిగించిన విషయం తెలిసిందే. అంటే ఈ సంవత్సరం మార్చి 31 నుంచి రాష్ట్రంలో ఉద్యోగులు పదవీ విరమణ చేస్తున్నారు. ఉద్యోగ విరమణ సమయంలో ప్రభుత్వం చెల్లించాల్సిన చెల్లింపులు చేయడమే లేదు. దీంతో ఈ ప్రభుత్వానికి ఉద్యోగుల పదవీ విరమణ అంశంలో కార్యాచరణ లోపించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే వివిధ విభాగాల ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు చెల్లించాల్సి ఉండగా, దానికి పదవీ విరమణ ఉద్యోగుల బెనిఫిట్స్ అంశం అదనం.
దేవుడు కరుణించినా గుడిలో పూజారి కనికరించలేదన్న చందంగా మారింది ఈ పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో సీఎంగా కేసీఆర్ విడుదల చేసిన డీఏను చెల్లించడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మనసొప్పడం లేదని ఉద్యోగులు, పెన్షనర్లు మండిపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ మంత్రివర్గం డీఏ చెల్లించాలని నిర్ణయం తీసుకున్నది. ఎన్నికల సంఘం అనుమతి కోరితే ఎన్నికల అనంతరం చెల్లించుకోవచ్చని ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినా ఆ డీఏను చెల్లించేందుకు కాంగ్రెస్ సర్కారుకు చేతులు రావడం లేదని ఆయా వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
కాంగ్రెస్ మ్యానిఫెస్టో తయారు చేసేనాటికి పెండింగ్లో మూడు డీఏలు ఇవ్వాల్సి ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై గత మార్చిలో సీఎం రేవంత్రెడ్డికి ఉద్యోగ సంఘాలు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసేనాటికి ఆ పెండింగ్ డీఏల సంఖ్య నాలుగుకు చేరింది. అనంతరం పార్లమెంట్ ఎన్నికలు పూర్తయి.. జూలై వస్తే ఆ డీఏల సంఖ్య ఐదు అవుతుంది. అయితే ఇటీవల తనను కలిసిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్ సంఘాల ప్రతినిధులతో ఓ కీలక నేత వ్యాఖ్యలు ఆయా వర్గాల్లో ఆందోళన కలిగిస్తున్నది. ‘జూలై వస్తే 5 డీఏలు చెల్లించాల్సి ఉంటుంది. దాంతో సర్కారు ఖజానాకు పెద్ద దెబ్బ తప్పదు. మధ్యేమార్గంగా పెండింగ్ డీఏల్లో ఒక్కటి చెల్లించి నాలుగింటిని ఎత్తేసి ఫిట్మెంట్ను పెంచితే ఎట్లా ఉంటుంది? అనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నాం’ అని పేర్కొన్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. అదే గనక జరిగితే ఉద్యోగుల్లో సర్కారుకు చెడ్డపేరు వస్తుందనే వాదనను మరో కీలకనేత వాదించినట్టు సమాచారం.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్ శివశంకర్ చైర్మన్గా నియమితులైన రెండో వేతన సవరణ సంఘం గడువు పూర్తయింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నిరుడు అక్టోబర్ 2న పీఆర్సీ కమిటీని నియమించింది. ఈ ఏడాది ఏప్రిల్తో ఈ కమిటీ గడువు పూర్తయింది. 6 నెలల్లో కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. రాష్ట్ర రెవెన్యూ వృద్ధిరేటు, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రస్తుతం, భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడులను దృష్టిలో పెట్టుకొని వేతన సవరణ సిఫార్సులతో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. వివిధ ఉద్యోగ సంఘాలు, పెన్షనర్స్ సంఘాల ప్రతినిధులు తమ వినతులను కమిటీకి ఇప్పటికీ నివేదిస్తూనే ఉన్నారు. కమిటీ కాలపరిమితి పూర్తయిన నేపథ్యంలో ఆ కమిటీ కాలపరిమితిని పొడిగిస్తారా? లేక ఇప్పటివరకు స్వీకరించిన వినతులను, నియమిత మార్గదర్శకాల ఆధారంగా సర్కారుకు సిఫారసులు చేయనున్నదా? అన్నదానిపై ఉద్యోగుల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి.
రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను సరిగా చదవలేదని, ఒకవేళ చదివినా అందులోని లోగుట్టును అర్థం చేసుకోలేదని ఆ పార్టీకి చెందిన కీలక నేత ఒకరు తమ అనుకూల ఉద్యోగసంఘం నేతతో పేర్కొన్నట్టు తెలిసింది. మ్యానిఫెస్టోలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పీఆర్సీని ప్రకటించి, ఆ కమిటీ ఇచ్చే సిఫార్సులను ఆర్నెల్లల్లో అమలు చేస్తామని చెప్పాం కానీ, ప్రస్తుతం ఉన్న పీఆర్సీ ఇచ్చే ప్రతిపాదనలు అమలు చేస్తామని కాదు కదా? అని సదరు నేత ఆ ఉద్యోగ సంఘం నేతతో పేర్కొన్నారని చెప్తున్నారు. అదే నిజమైతే ప్రస్తుతం ఉన్న కమిటీకి ఇచ్చే వినతులు, సుదీర్ఘ కసరత్తు అనంతరం కమిటీ సర్కారుకు చేసే ప్రతిపాదనలు బుట్టదాఖలేనా? అన్న అనుమానాలు ఆయా వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలతోపాటు పెన్షనర్లు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభయహస్తం పేరుతో 11 క్యాటగిరీలుగా ప్రభుత్వ/ప్రయివేట్ ఉద్యోగుల సంక్షేమాన్ని తన మ్యానిఫెస్టోలో పేర్కొన్న అంశాలు ఈ విధంగా ఉన్నాయి.
ఈ ప్రభుత్వానికి ఉన్న విజన్ ఏమిటో అర్థంకావడం లేదని ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు సిస్టమ్ అంతా వేరే ఉండె. కనీసం వారు (కేసీఆర్) పిలిచిన వారైనా లోపలికి వెళ్లి ఏదైనా చెప్తే నోట్ చేసుకునేది.. ఆ తర్వాత ఎవరో ఒకరు ఫాలోఅప్ చేసేవారు. ఇప్పుడు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. నో అపాయింట్మెంట్ అట.. ఈ సిస్టం ఏందో అర్థమే కావడం లేదు. మేమైతే అన్ హ్యాపీగా ఉన్నాం’ అని పేరు చెప్పడానికి నిరాకరించిన ఒక ఉద్యోగ సంఘం నాయకుడు వాపోయారు.
సీఎం దగ్గరికి పోదామంటే అదటు.. ఇదిటు అన్నట్టే తయారైందని సదరు నేత పేర్కొన్నారు. తీరా అతికష్టం మీద సీఎంను కలిసి వినతిపత్రం ఇస్తే కనీసం చదవనన్నా చదవడం లేదని, వాటిని చూడకపోతే ఎట్లా అని ఆయన వాపోతున్నారు. తాము ఇచ్చిన వినతిపత్రం శాఖల వారీగానైనా సెక్షన్కు అయినా పోవాలి కదా.. అదీ జరగడం లేదని ఉద్యోగులు దిగులు చెందుతున్నారు. గతంలో తాము వినతిపత్రం ఇస్తే దానిపై స్పందన ఉండేదని, కనీసం సంబంధిత శాఖ సెక్షన్ అధికారిని వాకబు చేస్తే తమ అర్జీ వచ్చిందని చెప్పేవాళ్లు.. ఇప్పుడా పరిస్థితి ఎక్కడుంది? అని వాపోతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో జవాబుదారీతనం లోపించిందని ఉద్యోగ, పెన్షనర్లు ఆరోపిస్తున్నారు. ‘కాంగ్రెస్కు సపోర్ట్ చేసినం. గొప్ప మ్యానిఫెస్టో పెడ్తిరి. అందులో ఒక్కటన్నా అటెండ్ చేసిండ్లా సార్ అంటే నవుతున్నడు’ అని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు గురించి పేరు చెప్పడానికి నిరాకరించిన పెన్షనర్ సంఘం నాయకుడొకరు పేర్కొన్నారు పైగా ‘సిచ్యుయేషన్ బాగాలేదండి.. రైతులు, మహిళలు, చేనేత వర్గాలు ఇలా అనేకవర్గాల సమస్యలు ఉన్నాయి. మీరే చూస్తున్నారుగా’ అంటూ మంత్రి బదులిస్తున్నారని సదరు నేత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్నివర్గాలకు న్యాయం చేయాల్సిందేనని, కానీ తమకు అన్యాయం చేయొద్దని సదరు నేత పేర్కొనడం గమనార్హం.
రాష్ట్రంలో అన్నివర్గాలను వంచించడమే కాంగ్రెస్ ఎజెండాగా పెట్టుకున్నది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ వర్గాల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధే లేదు. డీఏ చెల్లింపు విషయంలో ప్రభుత్వ వైఖరి దారుణం. గత ప్రభుత్వం నిర్ణయం మేరకు ఎన్నికల తర్వాత ఇవ్వొచ్చని ఎన్నికల కమిషన్ స్పష్టంగా చెప్పినా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇప్పటికి నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయి. ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు లేవు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి ఉపాధ్యాయులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. అధికారంలోకి రావడమే పరమావధిగా అనేక వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వాటిఅమలులో చిత్తశుద్ధి చూపడం లేదు.
– దేవీప్రసాద్, మాజీ అధ్యక్షుడు, టీఎన్జీవో సెంట్రల్ యూనియన్