హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పలు వృత్తి విద్యాకోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే పరీక్షల తేదీలను ప్రభుత్వం సోమవారం ఖరారుచేసింది. కరోనా నేపథ్యంలో పలు పరీక్షలను వాయిదావేసి, తిరిగి నిర్వహించే తేదీలను వెల్లడించింది. ఇంజినీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ను ఆగస్టు 4 నుంచి 10వ తేదీవరకు నిర్వహించనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. ఎంసెట్ సహా 7 ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను సైతం మంత్రి విడుదలచేశారు. ఇది వరకు ప్రకటించిన షెడ్యూల్కు భిన్నంగా ఈ ఏడాది సైతం ఎంసెట్ పరీక్షలు ఇంజినీరింగ్తోనే మొదలుకానున్నాయి. ఆగస్టు 4, 5, 6 తేదీల్లో ఇంజినీరింగ్వారికి, 9, 10 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్వారికి పరీక్షలను నిర్వహించనున్నారు. డిగ్రీ, పీజీ, వృత్తివిద్యాకోర్సుల సెమిస్టర్ పరీక్షలతోపాటు పలు రకాల ప్రవేశ పరీక్షల నిర్వహణపై మంత్రి సబితాఇంద్రారెడ్డి సోమవారం గన్ఫౌండ్రీలోని తన కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షలు, పలు ప్రవేశ పరీక్షల నిర్వహణపై సమీక్షించి, మొత్తం 7 రకాల ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను మంత్రి విడుదలచేశారు. కొవిడ్ మార్గదర్శకాలను అనుసరించి ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్టు మంత్రి తెలిపారు. ప్రవేశ పరీక్షల సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించినందున ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని వివరించారు. ఇంజినీరింగ్, పీజీ, డిగ్రీ, డిప్లొమా చివరి సెమిస్టర్ పరీక్షలను జూలై మొదటివారంలో ప్రారంభించి, నెలాఖరువరకు పూర్తిచేయాలని అన్ని యూనివర్సిటీల అధికారులను మంత్రి ఆదేశించారు. సమీక్షలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, వైస్చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ, కళాశాల విద్యా కమిషనర్ నవీన్మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.
1 నుంచి డిగ్రీ, పీజీ ప్రత్యక్ష బోధన
డిగ్రీ, పీజీ ప్రత్యక్ష క్లాసులను జూలై 1 నుంచి ప్రారంభించనున్నట్టు మంత్రి సబిత వెల్లడించారు. ప్రైవేటు స్కూళ్లలో అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకొంటామని ఆమె హెచ్చరించారు. ఈ వారంలోనే యాజమాన్యాలతో మంత్రి సమావేశం నిర్వహించి 30 శాతం ఫీజులు తగ్గించేలా విజ్ఞప్తి చేసే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. పాఠశాలల్లో తరగతుల ప్రారంభంపై బుధవారం మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతిరాథోడ్,గంగుల కమలాకర్తో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మూడు విడుతల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభిస్తే ఎలా ఉంటుందన్న కోణంలో విద్యాశాఖ అధికారులు ఆలోచిస్తున్నారు. ఇదిలాఉండగా, ఈ నెల 25 నుంచే టీచర్లు స్కూళ్లకు హాజరు కావాలని పాఠశాల విద్యాశాఖ సోమవారం ఉత్తర్వులుజారీ చేసింది.