హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసుల్ని కొట్టేయాలని ఆ కేసులో నిందితుడైన కోనేరు రాజేంద్రప్రసాద్ కొడుకులు మధు, ప్రదీప్ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ ఈ నెల 30కి వాయిదా పడింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్. నంద ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నేరపూరిత సొమ్ము పేరుతో ఈడీ తమ ఆస్తులను జప్తు చేయడం చెల్లదని వారి తరఫు సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్రెడ్డి వాదించారు.
1998లో బీమా పాలసీ డబ్బును జప్తు చేయడం చట్ట వ్యతిరేకమని పేర్కొన్నారు. ఎమ్మార్లో ప్లాట్లు కొన్న సీహెచ్ సురేశ్ రూ.65 లక్షలు, పార్థసారథి రూ.1.05 కోట్లు కోనేరు మధు బ్యాంకు ఖాతాలో జమ చేసిన మొత్తం దుబాయ్లోని ఎమ్మార్ కంపెనీకి జమ అయినట్లుగా ఈడీ ఆధారాలు చూపలేదన్నారు. ఎమ్మార్లో అక్రమంగా నిధులు రూ.96 కోట్లు జమ అయ్యిందని ఈడీ చెప్పే మొత్తానికంటే భారీగా పిటిషనర్లు, వారి తండ్రి ఆస్తులను ఈడీ జప్తు చేయడం చెల్లదన్నారు. విచారణ ఈ నెల 30కి వాయిదా పడింది.