New Ration Cards | హైదరాబాద్, ఫిబ్రవరి 29(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్త రేషన్కార్డుల కోసం అర్హత కలిగిన కుటంబాలకు ఎదురుచూపులు తప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకానికి తెల్లరేషన్కార్డును ప్రామాణికం చేసింది. దీంతో ఏ సంక్షేమ పథకం ద్వారా లబ్ధి పొందాలన్నా కచ్చితంగా తెల్ల రేషన్కార్డు ఉండాల్సిందే. అధికారంలోకి వస్తే అర్హులందరికీ కొత్త రేషన్కార్డులు ఇస్తామంటూ ఎన్నికల సమయంలో హామీలతో ఊదరగొట్టిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడు నెలలు కావస్తున్నా కొత్త రేషన్కార్డులను మాత్రం జారీ చేయడం లేదు. అప్పుడిస్తాం..ఇప్పుడిస్తాం.. అంటూ ప్రకటనలు చేయడమే తప్పా.. ప్రక్రియ మాత్రం కార్యరూపం దాల్చడం లేదు. ఓవైపు పథకాలకు రేషన్కార్డును తప్పనిసరి చేయడం, మరోవైపు కొత్తవాటిని జారీ చేయకపోవడంతో అర్హులైన వారు సంక్షేమ పథకాల లబ్ధి పొందలేకపోతున్నారు. దీంతో తమకు కొత్తకార్డులు జారీ చేయాలంటూ అర్హులైన వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
కొత్త రేషన్కార్డుల జారీపై ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు మూడు నెలలు కావస్తున్నది. అయినా కొత్త రేషన్కార్డు జారీపై ఇప్పటివరకు ఎలాంటి ప్రక్రియ మొదలు పెట్టలేదు. మరో వారం పది రోజుల్లో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నది. ఒకవేళ షెడ్యూల్ విడుదలైతే కొత్త పథకాలు అమలు చేసే అవకాశం ఉండదు. ఇదే జరిగితే కొత్త రేషన్కార్డుల కోసం మరో మూడు నెలలపాటు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అనే మాటే ఉండదు. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించాలనే డిమాండ్ వ్యక్తమవుతున్నది.
ఆరు గ్యారంటీల్లో భాగంగా రెండురోజుల క్రితం రూ.500కే గ్యాస్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ రెండు పథకాలకు కూడా తెల్ల రేషన్కార్డును తప్పనిసరి చేసింది. తెల్ల రేషన్కార్డు ఉంటేనే ఈ పథకాలకు అర్హులని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో అన్ని అర్హతలున్నా.. కేవలం తెల్ల రేషన్కార్డు లేకపోవడంతో ఆ పథకాలను అందులేకపోతున్నారు. దీంతో అర్హుల్లో అందోళన వ్యక్తమవుతున్నది. ఈ విధంగా ఓవైపు ప్రభుత్వం పథకాలను అమలు చేస్తుంటే అర్హత కలిగిన వాళ్లు అసంతృప్తికి లోనవుతున్నారు. తమకు కూడా తెల్ల రేషన్కార్డు జారీ చేస్తే.. పథకాల ద్వారా లబ్ధిపొందే వాళ్లం కదా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరీ ముఖ్యంగా గ్రామాల్లో కొత్త కార్డులు ఎప్పుడిస్తారంటూ గ్రామస్థాయి అధికారులను, నేతలను ప్రశ్నిస్తున్నారు. అర్హులైన వారికి కొత్త కార్డులు ఇవ్వకుండా పథకాలను ఏ విధంగా అమలు చేస్తారంటూ నిలదీస్తున్నారు. మార్చి 1 నుంచి ఈ రెండు పథకాలు అమల్లోకి రానున్నాయి. ఆ తర్వాత గ్రామాల్లో కొత్త రేషన్కార్డు జారీ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది.
కేసీఆర్ నాయకత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకంగా 6.5 లక్షల కొత్త కార్డులను జారీ చేసింది. తద్వారా సుమారు 21 లక్షల మందికి లబ్ధి చేకూరింది. 2021లో రికార్డు స్థాయిలో ఏకకాలంలో 3.11 లక్షల కొత్త రేషన్ కార్డులను పౌరసరఫరాల శాఖ జారీ చేసింది. 2021 జులై 26న కొత్త రేషన్కార్డుల పంపిణీని అప్పటి పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించి.. లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే కాంగ్రెస్ నేతలు మాత్రం గత ప్రభుత్వాన్ని బద్నాం చేసే విధంగా ఒక్క రేషన్కార్డు కూడా ఇవ్వలేదంటూ నిరాధార ఆరోపణలు చేయడం గమనార్హం.
తెల్ల రేషన్కార్డుల జారీలో ప్రభుత్వం చేస్తున్న జాప్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రేషన్కార్డుల సంఖ్యను పెంచడం వల్ల పథకాల లబ్ధిదారులు పెరిగి… ప్రభుత్వంపై ఆర్థికభారం పెరుగుతుందనే ఆందోళనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 90 లక్షల తెల్ల రేషన్కార్డులు ఉండగా 2.82 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో సుమారు మరో 9 లక్షల వరకు రేషన్కార్డుల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి కొత్త రేషన్కార్డులు జారీ చేస్తే లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నది. ఈ ఆర్థిక భారాన్ని తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే కొత్త రేషన్కార్డుల జారీని మొదలుపెట్టడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. రెండు నెలల క్రితం గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తులోనే ప్రత్యేక కాలమ్ పెట్టడం ద్వారా రేషన్కార్డుల దరఖాస్తులను స్వీకరించేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.