హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని పోలీస్ నియామక తుది రాత పరీక్ష ఫలితాలను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. మొత్తం 84.06 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించినట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. పరీక్షలకు 1,79,459 మంది అభ్యర్థులు హాజరుకాగా, 1,50,852 మంది అర్హత సాధించారని వివరించారు. కానిస్టేబుల్ సివిల్, ట్రాన్స్పోర్టు, ఎక్సైజ్ ఉద్యోగాలకు 98,218 (90.90%) మంది అభ్యర్థులు ఎంపికయ్యారని పేర్కొన్నారు. అభ్యర్థులు ఫైనల్ కీ, ఓఎంఆర్ షీట్లను www.tslprb.in వెబ్సైట్ ద్వారా లాగిన్ అయి పొందవచ్చని తెలిపారు. ఇబ్బందులు తలెత్తితే support@tslprb.in మెయిల్, 9393711110, 93910 05006 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్లో 17,516 పోలీస్ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.
రీ వెరిఫికేషన్కు అవకాశం
ఫలితాల్లో అభ్యంతరాలుంటే అభ్యర్థులు జూన్ 1 నుంచి 3 తేదీ సాయంత్రం వరకు రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవాలని బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఇందుకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2 వేల రుసుము, ఇతరులు రూ.3 వేల రుసుము చెల్లించి రీవెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేసుకోవచ్చని సూచించారు. వ్యక్తిగత లాగిన్ ఐడీ ద్వారా అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అభ్యర్థులు చివరిసారిగా తమ అప్లికేషన్లో దొర్లిన తప్పులను సరిదిద్దుకొనే అవకాశం కూడా కల్పిస్తున్నట్టు చెప్పారు. కులం, వయసు, స్థానికత, ఎక్స్ సర్వీస్మెన్ వంటివి సవరించుకోవచ్చని వెల్లడించారు.